అమరావతిలో రాజధాని నిర్మాణానికి వైఎస్ జగన్ వ్యతిరేకమని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఒక్క మాట మాట్లాడకుండా సమాధానం చెప్పారు వైఎస్ జగన్. అమరావతి ప్రాంతంలో జగన్ నిర్మించుకున్న ఇంట్లోకి ఆయన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమం టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబుకు చెంపపెట్టు వంటిదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.
సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సర్దేసుకున్నాక.. అమరావతిలో సొంత నిర్మాణం ఆలోచన చేయలేదు. ఆఖరికి తాత్కాలిక సచివాలయం.. తాత్కాలిక శాసనసభ.. ఇలా అన్ని తాత్కాలికమే.. ఆయన నివాసంతో సహా. హైదరాబాద్ లోనే చంద్రబాబు నాయుడి కుటుంబ నివాసం.. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేరే వాళ్ల ఎస్టేట్స్ లో అద్దెకు ఉంటున్నారు! నవ్యాంధ్ర సీఎం అయ్యాకా కూడా… చంద్రబాబుహైదరాబాద్ లోనే ఇళ్లు నిర్మించుకున్నారు.
ఆ సమయంలో ఏపీ ప్రభుత్వ సొమ్ముతోనే ఆయన కుటుంబం హైదరాబాద్ లో ఒక స్టార్ హోటల్ లో అద్దెకు ఉంది. అలాగే..హైదరాబాద్ లో బాబు నివాసం రిపేర్లరకు ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేసుకున్నారని సమాచారం. అమరావతిలో కేవలం అద్దె ఇంట్లో నివసిస్తున్న చంద్రబాబు…. ఇన్ని రోజులూ హైదరాబాద్ లో నివాసాన్ని కలిగి ఉన్నారని జగన్ను విమర్శించడం.. ఆయన చెప్పిన మాటలను ఏ మాత్రం ఆలోచించకుండా మీడియా టెలికాస్ట్ చేయడం.. విన్న జనం నిజమే అనుకోవడం.. ఇలా గడిచిపోయింది.
ఇప్పుడు జగన్ అధికారిక నివాసం కూడా అమరావతికి మారింది. జగన్ కుటుంబ సమేతంగా కొత్త ఇంట్లోకి చేరారు. చంద్రబాబు నాయుడు వ్యవహారాలు అన్నీ తాత్కాలికమే అని, జగన్ కే నిజమైన నిబద్ధత ఉంది కాబట్టి.. ఏపీలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇక వైఎస్ఆర్సీపీ నేత రోజా ఓ అడుగు ముందుకు వేసి చంద్రబాబును నిలదీశారు. ఏపీలో ఓటు హక్కు లేని చంద్రబాబు, అమరావతిలో కనీసం సొంత ఇంటి ఆలోచన చేయకుండా అద్దె ఇంట్లో ఉంటూ, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండాలన్న చిత్తశుద్ధితోనే రాజధానిలో సొంత ఇంటిని, శాశ్వత పార్టీ కార్యాలయాన్ని జగన్ నిర్మించారని చెప్పారు. టెంపరరీ కట్టాడాలతో సరిపెడుతున్న చంద్రబాబు టెంపరరీ సీఎం మాత్రమేనని, పర్మినెంట్ సీఎం వైఎస్ జగన్ అని అన్నారు.