ప్రత్యేక హోదాపై స్పీడ్ పెంచాలని వైఎస్సార్ సీపీ భావిస్తోంది. పోరును మరింత ఉధృతం చేసేందుకు వైఎస్ జగన్ వ్యూహాలను రచిస్తున్నాడు. పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగిస్తారనే సమాచారంతో రేపు శుక్రవారం (మార్చి 16) కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జగన్ తన సందేశాన్ని ఢిల్లీకి పంపించాడు అని సమాచారం. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టడంపై కూడా ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. దానికి తగినట్లు అన్ని పార్టీలకు లేఖలు రాయాలని జగన్ భావిస్తున్నాడు. అన్ని పార్టీలతో పాటూ టీడీపీకి కూడా లేఖను పంపాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే ఎంపీల రాజీనామాల విషయంలో కూడా వైసీపీ దూకుడుగా వ్యహరిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడే రోజే తమ పార్టీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట మార్చి 23వ తేదీన అవిశ్వాసం పెట్టాలని భావించారు.
కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ వ్యూహం మార్చినట్లు వినికిడి. వైసీపీ అవిశ్వాసం పెడితే పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. వైసీపీకి ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. వైసీపీ లేఖ ఇస్తే టీడీపీ తీసుకుంటుందా! అనేది ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ వైసీపీకి మధ్దతుగా నిలుస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే బీజేపికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టడమే దీనికి కారణం. అలాగే పక్క రాష్ట్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో తెలియదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నకు మొన్న మోదీని తిట్టి థర్డ్ ప్రంట్ ఆలోచన చేస్తున్నాడు. బీజేపీపై అవిశ్వాసం పెడితే టీఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వీటిన్నిటిని పరిగణనలోకి తీసుకొని జగన్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాడని సమాచరం.