ఎన్నికలు సమీపిస్తున్న తరునంలో ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయ్. ఈ నెల 15 మంత్రి వర్గ విస్తరణ ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భాజాపా-టీడీపీ మధ్య విబేధాలు రావడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే.
కేంద్రప్రభుత్వం నుండి ఎన్డీఏ నుండి తెలుగుదేశంపార్టీ తప్పుకోవటంతో రాష్ట్ర మంత్రివర్గానికి బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో దాదాపు రెండు నెలలుగా వారి స్ధానాలు భర్తీ కాకుండా అలానే ఉండిపోయాయి. వాటిని భర్తీ చేసేందుకు బాబు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 15 ముహూర్తం సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
గతంలో మంత్రి పదవులు దక్కని టీడీపీ ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో బాబుపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఖాలీ అయిన స్థానాలను భర్తీ చేస్తే బాగుంటుందని బాబు ఆలోచిస్తున్నారు. మరో వైపు ఇప్పుడున్న మంత్రులలో చాలామంది పనితీరు బాగాలేదనె రిపోర్ట్లు బాబు దగ్గర ఉన్నాయి.
అటువంటి వారిలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్పీకర్ పదవిలో ఎప్పటి నుండో కోడెల శివప్రసాదరావు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని స్పీకర్ చంద్రబాబును కోరినట్లుగా కూడా ప్రచారంలో ఉంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.