ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనే పంతంతో బీజేపీ పెద్దలు మోదీ, అమిత్షాలు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఏ చిన్న అవకాశం దొరికినా.. దానిని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ.. వాళ్ల ప్రయత్నాలన్ని చంద్రబాబు చాణక్యనీతి ముందు బెడిసి కొడుతున్నాయి. అయినా.. తమ పట్టుదల వదలకుండా ఎలాగైనా దక్షిణ భారతదేశంలోనే తమకు అడ్డుగా ఉన్న ఏకైక పెద్ద నాయకుడైన చంద్రబాబును పక్కకు తప్పించాలని తమ అధికార, అనధికార, ఆర్థిక, రాజకీయ బలాలన్నింటినీ ఒడ్డుతున్నట్టు గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబుతో అతిపెద్ద ముప్పు బీజేపీకి పొంచి ఉందే. అదే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు. వాటిలో ఎలాగైనా.. గెలిచి తీరాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఓడిపోతే.. అది తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అందుకే.. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ఘర్, ఎంపీ, మిజోరాం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముందస్తుగా జరిగితే.. అక్కడ విజయం సాధించేందుకు ఏమేం ఆటంకాలున్నాయో.. అన్నింటినీ బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి మహా కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మరోపక్క మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓటమికి చంద్రబాబు తన ఆర్థిక బలం వినియోగించే అవకాశం ఉందని బీజేపీ అంచనాకు వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి మూడో కూటమి ఏర్పాటుకు చంద్రబాబు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉన్నంతవరకూ తమకు ఎలాగైనా.. ఏ రూపంలోనైనా ముప్పుతప్పదనేది మోడీ, అమిత్షాలకు బాగా తెలుసు. అందుకే.. తమకున్న సర్వాధికారాలను ఆంధ్రప్రదేశ్పై ఎక్కుపెట్టేందుకు.. గత ఏడెనిమిది నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
బీజేపీ ద్వయం ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. వాటిని ముందే చంద్రబాబు పసిగడుతున్నారు. మోడీ, అమిత్షా ద్వయం కంటే.. రాజకీయ చదరంగంలో ఆరితేరిన నేత చంద్రబాబు. ఎన్నో డక్కీ మొక్కీలు తిని.. దేశంలోనే చక్రం తిప్పిన ఘన చరిత్ర చంద్రబాబుకుంది. అందుకే.. చంద్రబాబు బీజేపీ వేసే ఎత్తులను వాళ్లకంటే ముందే ఊహించడం, ఢిల్లీలోని తనకు అత్యంత విశ్వాసపాత్రులైన వారి ద్వారా సేకరించడం చేస్తున్నారు. శివాజీ లాంటి వాళ్లు తమ రాష్ట్రంపై ప్రేమతో.. చేస్తున్న ప్రయత్నాలు కూడా చంద్రబాబుకు కలిసొస్తున్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న ఎత్తుగడను బీజేపీ వేసినా.. అడ్డంగా దొరికిపోతోంది. మీడియా, ప్రజల్లో గత కొంతకాలంగా ఈ విషయంపై చంద్రబాబు బాగా హైప్ క్రియేట్ చేశారు. అందుకే.. చీమ చిటుక్కుమన్నా.. అందరికీ తెలిసిపోతోంది. బీజేపీ ప్రభుత్వమే కారణమనే విషయం క్షణాల్లో దేశమంతా పాకిపోతోంది. దీంతో వ్యూహం మార్చుకుని.. పీచేముడ్ అనాల్సిన పరిస్థితి బీజేపీకి ఎదురవుతోంది. ఎన్నో రాష్ట్రాల్లో స్థానిక పార్టీలను నామరూపాల్లేకుండా చేసి.. కాషాయ జెండా పాతిన తమకు ఆంధ్రప్రదేశ్ సీఎం పెద్ద విషయం కాదనే భ్రమలో ఇన్నాళ్లూ ఉన్న మోడీ, అమిత్షాలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థమవుతున్నాయి. రామ్మాధవ్, కన్నా లక్ష్మినారాయణ లాంటి వాళ్లు చంద్రబాబు ముందు పూచికపుల్లలతో సమానమనే విషయం స్పష్టంగా కేంద్రానికి తెలిసిపోయింది.
అందుకే.. ఆచితూచి.. తాజాగా ఐటీ దాడులంటూ చాపకింద నీరులా తెలుగుదేశం పార్టీకి ఆర్థిక మూలాలు అందించే సంస్థలను టార్గెట్ చేయాలని, అదికూడా ఎవరికీ అనుమానం రాకుండా చేయాలని.. వీళ్లను అడ్డుపెట్టుకుని.. రాష్ట్రమంత్రులు కొందరిని ఇరికించాలని స్కెచ్ వేశారు. కానీ.. అప్పటికే చంద్రబాబు దీనిపై అలర్ట్ అయిపోయి.. మీడియాకు లీకులిచ్చారు. దీంతో ఐటీ దాడులు ముమ్మరంగా రాష్ట్రంపై జరగబోతున్నాయని, వీటి వెనుక మోడీ, అమిత్షా కుతంత్రం ఉందంటూ మొన్న రాత్రి నుంచే మీడియా ఛానెళ్లు హడావుడి మొదలెట్టాయి. ఇంక చేసేది లేక.. ఐటీ వ్యూహం మారి.. ఏదో ఒకటి రెండు చిన్న కంపెనీల్లో సోదాలు జరిపి.. వెళ్లిపోయారు. నిజానికి ఈ దాడుల వెనుక ఉద్దేశం వేరే ఉందని, మంత్రి గంటా, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ విద్యాసంస్థల అధినేత అయిన మంత్రి నారాయణ వంటి నాలుగైదు పెద్ద తలకాయలే లక్ష్యంగా వచ్చారనే విషయం ముందే బయటకు లీక్ చేశారు. దీంతో ప్రజల దృష్టిలో ఇవో కక్ష సాధింపు దాడులుగా తేలిపోయి.. రాష్ట్రంలో మరింత కంపైపోవడం ఇష్టం లేని బీజేపీ ద్వయం తమ ఆలోచనను వెనక్కు తీసుకున్నట్టు ఆ పార్టీకే చెందిన ఓ పెద్ద నాయకుడు ఆద్య న్యూస్కు వెళ్లడించారు.