2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ప్రత్యేకహోదా పోరుతో జనాల్లోకి వైసీపీ చొచ్చుకుపోగా టీడీపీ మాత్రం ఇంటా బయట విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని టీడీపీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. ఈ విబేధాల రచ్చ పంచాయితీ చంద్రబాబు దగ్గరకు చేరింది.
కర్నూలు జిల్లాలో ఉప్పూ నిప్పులా నిత్యమూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిలను తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు, ఇద్దరిపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరస్పర విమర్శల కారణంగా పార్టీకి నష్టం కలుగుతోందని, ఇటువంటి ఘటనలు ఇకపై తన దృష్టికి రారాదని హెచ్చరించారు.
అందరినీ కలుపుకుని వెళితేనే పైకి ఎదుగుతారని అఖిలప్రియకు చురకలు అంటించారు. ఆ సమయంలో తనకు ఎదురవుతున్న సమస్యలను అఖిల ప్రియ ప్రస్తావించబోగా, అవన్నీ తన ముందు చెప్పవద్దని, నీ ముందున్న సమస్యలకన్నా తన ముందు ఎంతో పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పారు.
గతంలో ఒకటిగా ఉన్న రెండు కుటుంబాలూ ఇప్పుడు విడిపోతే ప్రజలు తప్పుగా భావిస్తారని అటు ఏవీకి, ఇటు అఖిలకూ నచ్చజెప్పారు. ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పిస్తే తండ్రి లేని పిల్లలకు అండగా లేరని ప్రజలు భావిస్తారని, అఖిల విమర్శిస్తే, తండ్రి సమానులను, ఆయన స్నేహితులను దూరం చేసుకుంటోందని అనుకుంటారని వ్యాఖ్యానించారు. సమస్యలు ఉంటే పార్టీలో చెప్పుకోవాలే తప్ప, బహిరంగ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చిన్న వయసులో వచ్చిన మంత్రి పదవిని కాపాడుకోవాలని అఖిలప్రియకు సూచించారు.