వైకాపా గుర్తుతో గెలిచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యేలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీలో కనీసం మనుషులుగా చూడటం లేదని నేతలు ఆవేధన చెందుతున్నారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన, సభ్యత్వ కార్డులను విష్ణు అనుచరులు దొంగిలించారని ఆరోపించారు. సభ్యత్వ నమోదు కోసం రూ.13.50 లక్షలు చెల్లిస్తే ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు వాటిని ఇవ్వలేదన్నారు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం తనకు లేదని.. తాను టీడీపీకి అమ్ముడుపోయానని ఆత్మసాక్షిగా చెబుతున్నానని మణిగాంధీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే టీడీపీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారని, అయితే వాళ్లలా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నారు.
కడప జిల్లాలోని బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములు పరిస్ధితి కూడా తనకు లాగే తయారైందంటూ మరో విషయం చెప్పారు. టిడిపిలో తామిద్దరమూ ఇమడలేకపోతున్నట్లు చెప్పారు. త్వరలో తామిద్దరమూ టిడిపికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. 6 నెలలు ఓపికిపడితే రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని జోస్యం చెప్పారు. పరిస్ధితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తను ఓటమి తప్పదని మణిగాంధి అంగీకరించారు.
విష్ణువర్ధన్రెడ్డితో రాజీ కావాలని వర్ల రామయ్య, ఇన్చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనను బతిమిలాడినా లెక్క చేయలేదన్నారు. వైకాపా తరఫున పోటీచేసిన తనకు సీఎం చంద్రబాబుకంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మగితా నేతలు తమ పరిస్థితిని బయటకు చెప్పుకోలేకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.