గత ఎనిమిదేళ్ళ కాలం నుంచి దేశంలో నరేంద్ర మోడీ మ్యానియా గట్టిగానే ఉంది. 2014 లో ప్రధానిగా అధికారం చేపట్టినది మొదలుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ.. దేశ వ్యాప్తంగా బీజేపీని ఎదురులేని శక్తిగా నిలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరించే క్రమంలో మోడీ- అమిత్ షా ద్వయం.. మిత్రపక్షాల పట్ల ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తారనేది ఆయా పార్టీల వాదన. దాంతో బీజేపీ అధీనంలో ఉండే ఎన్డీయే కూటమిలో ఉండేందుకు చాలా పార్టీలు విముఖత చూపుతున్నాయి.. ఒకప్పుడు చాలా పార్టీలతో దేశంలోనే అతిపెద్ద నేషనల్ డెమోక్రటిక్ కూటమిగా పేరున్న ఎన్డీయే.. మోడీ- అమిత్ షా నిర్ణయాలతో ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
1998 సంవత్సరంలో వాజ్ పేయి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి 1998 నుంచి 2004 వరకు కేంద్రంలో అధికారంలో కొనసాగింది. ఆ తరువాత మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి అప్పటినుంచి ఇప్పటివరకు కూడా అధికారంలో కొనసాగుతోంది. అయితే ఈ మద్య కాలంలో చాలా పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాయి. డీఎంకే, శివసేన, అకాలీదళ్, టిడిపి, భారతీయ నవాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, ఇక తాజాగా బిహార్ లోని జేడీయూ పార్టీ ఇలా చాలా పార్టీలు ఎన్డీయే కూటమికి టాటా చెప్పేశాయి.
అయితే ఇలా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పార్టీలు ఏం చెబుతున్నాయంటే.. తమతో మిత్రపక్షంగా ఉంటూనే తమ రాష్ట్రాలలో తమ పార్టీ బలాన్ని తగ్గించి బీజేపీ బలం పెంచుకునే విధంగా మోడీ-అమిత్ షా ప్రణాళికలు వేస్తున్నారని ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే ఎన్డీయే లోని బీజేపీ వైఖరి పట్ల విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మహారాష్ట్రలోని శివసేన విషయంలో జరిగింది అదే.. ఇక అదే విధంగా బిహార్ లో కూడా వ్యూహం వేసిన కమలనాథుల కు జేడీయూ షాక్ ఇస్తూ మొత్తంగా ఎన్డీయే నుంచే నిష్క్రమించింది. దాంతో ఇప్పటివరకు గడిచిన మూడేళ్లలో మూడు ప్రధాన పార్టీలైన శివసేన, జేడీయూ, అకాలీదళ్ వంటి పార్టీలు ఎన్డీయే కూటమికి టాటా చెప్పేశాయి. మరి కొన్ని పార్టీలు కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు డిల్లీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?