ఆంధ్రప్రదేశ్కు 2019 ఎన్నికల్లో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తే.. పాలన ఇప్పుడు ఎలా సాగుతుందో అలాగే కొనసాగుతుంది. చంద్రబాబు దృష్టి ప్రధానంగా అమరావతి నగర నిర్మాణంపై పెడతారు. ఇప్పటికే రాష్ట్రానికి ఐటీ, ఉత్పత్తుల తయారీ రంగ కంపెనీలను భారీ సంఖ్యలో రప్పించేందుకు చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారు. దేశవిదేశాల్లో పర్యటించి.. ఆయా సంస్థల అధినేతలను కలిసి మాట్లాడారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. ఒప్పందాలన్నింటినీ పట్టాలెక్కించేందుకు మొదటి ఏడాది నుంచి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ సంపదను సృష్టించడంపైనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. ఎలా ఎదగాలా అనే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటివరకూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పాలనను గాడిలో పెట్టడం, కంపెనీలను ఎక్కడెక్కడ.. ఎలాంటివి ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉందో చూసి.. వారిని ఆహ్వానించడం వంటి విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. మళ్లీ చంద్రబాబు వస్తే.. లక్షల కోట్ల ఈ లెక్కలు పక్కా అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అన్నింటి కంటే ప్రధానంగా.. ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలన్నీ అలాగే కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
2004లో అధికారానికి దూరమైన తర్వాత పదేళ్లకు మళ్లీ సీఎం పీఠంపై చంద్రబాబు 2014లో కాలు మోపారు. తాను మంచి ఫాంలో ఉండగా అధికారానికి దూరమవ్వడంతో.. ఎందుకిలా జరిగిందనే బెరుకు ఈ నాలుగేళ్లలోనూ చంద్రబాబులో కనిపిస్తూ వచ్చింది. అందుకే.. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి విషయంలోనైనా ఉపేక్షించేది లేకుండా.. తప్పు చేస్తే వెంటనే చర్యలు చేపట్టేవారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం చంద్రబాబు పేరు వింటే వణికిపోయేవారు. కానీ.. ప్రస్తుతం బాబు తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. అందుకే అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందనే విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి. కొందరు మంత్రులు వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్నారంటూ ఆరోపణలు వచ్చినా.. చంద్రబాబు వాటి విషయంలో సీరియస్గా తీసుకున్నది లేదు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విషయంలోనూ గతంలో ఉన్నంత కఠినంగా లేరు. తాను గతంలో ఈ రెండింటి విషయంలో కఠినంగా ఉండడం వల్లే.. అధికారానికి దూరమైపోయాననే భావన బాబులో బలంగా ఉంది. అందుకే.. ఆచితూచి వ్యవహరిస్తూ.. పాలన కొనసాగించారు. కానీ.. మళ్లీ చంద్రబాబు అధికారంలోనికి వస్తే మాత్రం.. ఇప్పుడున్నట్టు ఏ విషయంలోనైనా చూసీచూడనట్టు ఉండరు. ప్రతి లెక్కకూ జవాబుదారీతనం ఉండాలనే పంథాలో సాగొచ్చు.
ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబాట్లు జరుగుతున్నా.. అధికారంలో ఉండి కూడా ఈ నాలుగేళ్లలో చంద్రబాబు వారిపై ఏనాడూ చర్యలు చేపట్టింది లేదు. కానీ.. వచ్చేసారి ఇలాంటి వారి పీచమణిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 68 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుకు.. ముఖ్యమంత్రిగా ఇదే ఆఖరి అవకాశం కావొచ్చు. వారసుల రంగప్రవేశం ఇప్పటికే జరిగిపోవడంతో.. వారిని పీఠంపై కూర్చోబెట్టి వచ్చేసారికి తప్పుకునేందుకు ఆస్కారముంది. అందుకే.. రాష్ట్రంపై తన ముద్రను బలంగా వేసేసి వెళ్లాలనే తపన ఇప్పటికే చంద్రబాబులో కనిపిస్తోంది.. అన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు.. ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదు. ప్రతిపక్ష పార్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. నాయకులందరికీ వలేసి తమలో చేర్చుకుంటున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోనికి వస్తే.. ప్రస్తుతం ఉన్నంత సౌమ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో ఉండకపోవచ్చు. ప్రధానంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టి.. బలహీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాలం వేసి.. జగన్ను బలహీన పరిచేందుకు ఆస్కారం ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది.