ఆంధ్రలో ప్రస్తుతం బీజేపీ ఓ అంటరాని పార్టీగా మారిపోయింది. బీజేపీతో మీకు లింకుందటే.. లేదు మీకే ఉందంటూ మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీతో మేం పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతామంటే.. మేం దిగుతామంటూ ఈ మూడు పార్టీలు తెగ ఆరాటపడ్డాయి. యువతలో మోడీకి ఉన్న పాపులారిటీ కలిసొస్తుందని ఎవరి లెక్కలు వారేసుకున్నారు. కానీ.. కేవలం మూడు నాలుగు నెలల వ్యవధిలో సీన్ రివర్స్ అయిపోయింది.
ఇప్పుడు బీజేపీ పేరు చెబితే.. ఈ మూడు పార్టీలు దూరం జరిగిపోతున్నాయి. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే.. నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని తెలిసే.. వీళ్లు ఇలా దూరం దూరం జరుగుతున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడితే.. ఆదుకుంటానంటూ వచ్చిన బీజేపీ ముంచేసింది. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో డబల్గేమ్ ఆడింది. ప్యాకేజీ అంటూ పాచిపోయిన లడ్డూలు కూడా ఇవ్వలేదు. దీనికితోడు మోడీ గత రెండేళ్లలో పెంచిన ధరలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు మోడీ గొంతు వింటేనే.. కంపరంగా ఉంటోందంటూ తెలుగు ప్రజలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు మాత్రం బీజేపీతో కలిసి ముందుకెళ్లేందుకు సాహసిస్తారు.
చంద్రబాబునాయుడు అందరి కంటే ముందే ప్రమాదాన్ని గుర్తించి బయటకొచ్చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో ఉన్న లింకును గత మార్చిలో తెంచేసుకున్నారు. ఇంక నెమ్మదిగా.. వాయిస్ పెంచుతూ.. ఇప్పుడు బీజేపీ పేరు చెబితే అగ్గిమీద గుగ్గిలంలా ఆరోపణలు చేస్తున్నారు. అటునుంచి బీజేపీ సైతం తమ శత్రువు చంద్రబాబే అన్నట్టుగా తీవ్ర పదజాలంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వరా.. రెండు పార్టీల మధ్య మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన దోస్తీకి ముగింపు పడింది. చంద్రబాబు తెగతెంపులు చేసుకుని వచ్చే సమయానికి.. కనీస ప్రణాళిక లేని వైసీపీ అధినేత బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఎలాగూ చంద్రబాబుతో దోస్తీ కటీఫ్ అవ్వడంతో.. ఏపీలో రెండో అతిపెద్ద పార్టీ జగన్దే కావడంతో బీజేపీ సైతం వారికి దారులు తెరిచింది.
కానీ.. వారితో దోస్తీ తెంచుకున్న చంద్రబాబు ఊరకే ఉండరుగా.. అప్పటి నుంచి గత నాలుగు నెలలుగా బీజేపీ ఎంత ద్రోహం చేసింది, ఏమేం ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వకుండా అన్యాయం చేసిందనే విషయాలపై నిత్యం ఊదరగొడుతూనే ఉన్నారు. ఇంకేముంది.. ఇప్పుడు బీజేపీ పేరు చెబితే సామాన్యడు సైతం మండిపడుతున్నాడు. రాష్ట్రానికి నిధులివ్వకుండా వేధిస్తోందని, బీజేపీ పార్టీ ఏపీలో నిలదొక్కుకునేందుకు ఆపరేషన్ గరుడ మొదలెట్టిందనే విషయాలు బలంగా జనంలోనికి వెళ్లిపోయాయి. ప్రమాదాన్ని ఊహించకుండా.. పులినోట్లో తలపెట్టిన జగన్ పార్టీ ఇప్పుడు కళ్లు తెరిచింది. అబ్బే మాకు బీజేపీతో లింకులేంటీ.. అదంతా చంద్రబాబు కుట్రంటూ గొంతెత్తి అరుస్తున్నా.. ఎవ్వరూ నమ్మడం లేదు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మోడీకి వంగి వంగి సలాములు కొట్టడం, అడగ్గానే ప్రధాని అపాయింట్మెంట్లు ఇచ్చేయడం వంటి.. సాక్ష్యాలన్నింటికీ ఎంత ప్రచారం చేయాలో.. అంతా తెలుగుదేశం పార్టీ చేసింది. ఇంకేముంది.. ఇప్పుడు ఆ మచ్చను చెరుపుకునే పనిలో వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. పైగా.. రాష్ర్టానికి ఏ కేంద్రమంత్రి వచ్చినా, ఉప రాష్ట్ర పతి వచ్చినా.. తెలుగుదేశం నేతలే వాళ్లతో ఉంటున్నారంటూ సాక్ష్యాలు చూపెడుతోంది. అధికారంలో ఉన్న మేము కాక.. మీరు వెళ్లి పోలవరం లాంటి పనులను చూపెడతారా.. అంటూ వాళ్లు కౌంటర్లు ఇస్తున్నారు.
మరోవైప పవన్ కళ్యాణ్కు సైతం బీజేపీ మకిలి అంటించేందుకు తీవ్రంగానే.. తెలుగుదేశం, వైసీపీలు ప్రయత్నం చేస్తున్నాయి. గవర్నర్ మధ్యవర్తిగా ఉండి పవన్కు బీజేపీతో లింకు కుదిర్చారని, అందుకే.. కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదంటూ ప్రచారం చేశారు. వీళ్ల ప్రచారానికి మద్దతు చేకూర్చేలా.. పవన్ సైతం అనూహ్యంగా గత నాలుగైదు నెలలుగా బీజేపీని అస్సలు విమర్శించడం లేదు. అంతకుముందు.. కేంద్రం ఇచ్చే హోదా, ప్యాకేజీపై విరుచుకుపడిన పవన్.. ఎందుకిలా మారిపోయాడనేది సైతం సందేహాస్పదంగానే మారింది. ఏదేమైనా.. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీతో తమకు లింకులేదని నిరూపించుకునేందుకు ఎన్ని ఫీట్లు చేయాలో అన్నీ చేస్తున్నాయి.