కర్నాటక ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పార్టీల మధ్య విమర్శలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ పలు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. మే 15 తర్వాత ‘కాంగ్రెస్’ జాతీయ పార్టీగా కాకుండా కేవలం ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుందని, ఇకపై ‘కాంగ్రెస్’ ను పీపీపీ (పంజాబ్, పుదుచ్చేరి పరివార్)గా సంబోధించవచ్చని మోదీ వ్యాఖ్యానించారు.
అయితే మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం సిద్ధారామయ్య ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఓ ట్వీట్ ద్వారా మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ సార్.. పీపీపీ అంటే.. పంజాబ్, పుదుచ్చేరి పరివార్ కాదు! దాని అర్థం నేను చెబుతాను. పీపీపీ అంటే ‘ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్’ అనేది అసలు అర్థం. మీ పార్టీ వీటికి దూరం కనుక, అవి మీకు అర్థం కాలేదు’ అని విమర్శించారు.
ఇదే ‘పీపీపీ’ని బీజేపీకి అన్వయించిన సిద్ధరామయ్య కొత్త భాష్యం చెప్పారు. ‘పీపీపీ అంటే..ప్రిజన్, ప్రైస్ రైజ్, పకోడా’ నేను చెప్పింది నిజమే కదా మోదీ సార్?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎట్టకేలకు మీరు మహాదయి నది వివాదంపై నోరు విప్పినందుకు ధన్యవాదాలు. వివాదం పరిష్కరించడానికి, దీనిపై స్పందించడానికి మీకు ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఎన్నికలు లేకపోతే మీరు దీని గురించి మాట్లాడరు’ అని ట్వీట్ చేశారు.