వారం రోజులనుంచి తాడిపత్రి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనా ప్రకంపనలు సద్దుమనిగేలా కనిపించడంలేదు. మొదట చంద్రబాబు జోక్యంతో రాజీనామాపై మెత్త బడ్డ జేసీ ఇప్పుడు తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. వ్యక్తులను చూసి పదవులు రావని పరోక్షంగా బాబు జేసీకి వార్నింగ్ ఇచ్చారు.
బాబు వార్నింగ్ను ఏమాత్రం లెక్కచేయడంలేదు జేసీ. బాబుకు తన సత్తా ఏంటో చూపించాలని డిసైడ్ అయ్యారు జేసీ. తన డిమాండ్ను నెరవేరేంత వరకు చంద్రబాబుతో మాటలుండవని ప్రకటించారు. ఎంపీ పదవికి రాజీనామాపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. బ్రహ్మదేవుడు దిగి వచ్చినా రాజీనామాపై వెనక్కు తగ్గనన్నారు. తాను రాజీనామాపై వెనక్కు తగ్గాలంటే చాగల్లు రిజర్వాయర్కు నీటిని కేటాయిస్తూ జీవో విడుదల చేయాల్సిందేనన్నారు.
చాగల్లు రిజర్వాయర్కు నీటి కేటాయింపులకు సంబంధించి జీవో విడుదల చేయకుండా ప్రస్తుతానికి మాత్రమే నీళ్లు వదులుతామంటే ఊరుకునే పరిస్థితే లేదన్నారు. మంత్రి దేవినేని ఉమా ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పానన్నారు. జీవో విడుదల చేసే వరకు విజయవాడకు వెళ్లబోనని… ఎవరితోనూ చర్చలు జరపబోనన్నారు. జిల్లా టీడీపీలోని ఒక వర్గం నేతలపై జేసీ విమర్శలు చేశారు. తాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ లాంటి వారితోనే రాజకీయం చేసిన వాడినని ఇప్పుడున్న చెత్తనాయకులకు భయపడే తత్వం తనది కాదన్నారు.
ఎంఎల్ఏ, మంత్రి మధ్య గత కొన్ని రోజులుగా విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అవి తారాస్థాయికి చేరడంతో అనంపురం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. చాగల్లు రిజర్వయర్కు నీటిని కేటాయిస్తూ జీవో విడుదల చేసే వరకు చంద్రబాబుతో కూడా తాను చర్చలు జరిపే పరిస్థితి లేదన్నారు. బాబు ఇచ్చిన వార్నింగ్తో జేసీ దిగి వస్తారనుకుంటె అది కాస్త రివర్స్ అయ్యింది. మరి బాబు ఇప్పుడు జేసీ విషయంలో ఏంచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.