కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘డిస్లెక్సియా’తో బాధ పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అంతటి మాటతో విమర్శించవచ్చా! అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇంతకు ‘డిస్లెక్సియా’ అంటే ఏమిటీ ? దాని లక్షణాలేమిటీ ? అది దేశంలో ఎంత మందికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ? నిజంగా రాహుల్ గాంధీలో ఆ లక్షణాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు సగటు భారతీయుడిలో ఉన్నాయి.
డిస్లెక్సియా అంటే ఓ జబ్బు కాదు. నరాలకు సంబంధించి జన్యుపరమైన లోపం. దీనితో బాధ పడుతున్నవారు. సరిగ్గా చదవ లేరు. సరిగ్గా రాయలేరు. సరిగ్గా అర్థం చేసుకోలేరు. పిల్లల్లో పిండం దశలోనే ఈ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కలిగిన వారికి సాధారణ తెలివితేటలు, కొందరిలో ఎక్కువ తెలివితేటలు కూడా ఉంటాయి. స్ట్రోక్ వల్ల పెద్ద వాళ్లలో కూడా ఈ నరాల లోపం ఏర్పడుతుంది. దీన్ని ప్రధానంగా ‘లర్నింగ్ డిఫికల్టీ ప్రాబ్లమ్’గా వైద్యులు వ్యవహరిస్తారు.
ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న 40-50 ఏళ్ల బాలుడు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్ష వ్యంగ్యాస్త్రాలు విసరడంపై ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు, అటు విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోడీ కామెంట్స్ ఆయనలోని అపరిపక్వతను చాటుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.