చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీలోకి వలసలు ఆగడంలేదు. విజయవాడ టీడీపీకి చెందిన మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీఎంపీ అవంతి, చీరాల ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాసరి జైరమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖరారైందని భావిస్తున్నారు. ఇవాల సాయంత్రం వైఎస్ జగన్తో భేటీ అవుతున్నట్లు సమాచారం.
విజయవాడలో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించిన జగన్ కు దాసరి జైరమేశ్ రూపంలో దొరికారు. విజయవాడ బరిలో జైరమేశ్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం దాసరి జైరమేశ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
విజయవాడలో టీడీపీని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి కావాలని భావిస్తున్న వైసీపీ… ఇందుకోసం విజయ్ ఎలక్ట్రికల్ అధినేత దాసరి జైరమేశ్ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దాసరి జైరమేశ్తో పాటు టీడీపీ సీనియర్ నేత దాసరి బాలవర్ధనరావు కూడా వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేతే దాసరి జైరామ్ రమేష్. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన రమేష్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతోపాటు పార్టీ కీలక వ్యవహారాలు చూసేవారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
దాసరి జైరామ్ వైసీపీలోకి వచ్చేందుకు దగ్గుపాటి వ్యూహం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కుమారుడు హితేష్తో కలిసి వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు… విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై జగన్తో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా జైరమేశ్ పేరును తెరమీదకు తెచ్చినట్లు సమాచారం..