తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మరికొందరు టీడీపీ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఉమామాధవ రెడ్డి కూడా రేవంత్తో పాటు కాంగ్రెస్లో చేరుతారని భావించారు. కానీ తనకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీరాలేదని అందుకే కాంగ్రెస్లో చేరలేదన్నారు.
ఇటీవలే ఉమామాధవ రెడ్డి టీడీపీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో టీడీపీ పని అయిపోయిందని చేసిన వ్యాఖ్యుల కలకలంరేపాయి . అప్పుడే టీఆర్ఎస్లో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. తర్వాత ఆ ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఆమె వెంట ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో ఉమా మాధవరెడ్డి చర్చలు జరిపారు.
టీఆర్ఎస్ చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీరి రాకను కేసీఆర్ ఆహ్వానించారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తమ అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి, సందీప్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నట్టు తెలిపారు