విశాఖ ఎయిర్ పోర్ట్లో జగన్పై కత్తితో డాడి జరిగిన తర్వాత తెలంగాణా ప్రభుత్వం భద్రత గురించి కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి అనంతరం అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. గాయం మానకపోవడంతో విశ్రాంతి తీసుకోవాల డాక్టర్లు చెప్పడంతో లోటస్ పాండ్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.దీంతో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.
జగన్ భద్రత గురించి ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం బుల్లెట్ ప్రూప్ వెహికల్ను కేటాయించింది. అలాగే జగన్ ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జగన్ కాన్వాయ్ హైదరాబాద్లో ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వీవీఐపీలు పర్యటనలకు వచ్చినప్పుడు, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని తదితర ప్రముఖులకు మాత్రమే ఈ రూట్ క్లియరెన్స్ అమలవుతుండగా, ఈ జాబితాలో జగన్ కూడా చేరారు.
జగన్ కాన్వాయ్ కోసం ఏ విధమైన కొత్త ఆంక్షలనూ విధించబోమని, ఆయన ప్రయాణించే రూట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లోని భద్రతను కూడా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.