2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబుకు నలువైపుల నుంచి సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవీ మరీ ఎక్కువయ్యాయి. ప్రధానంగా సొంత పార్టీ నుంచి వస్తున్న సమస్యలతో బాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మొదట ఫిరాయింపులను ప్రోత్సహించిన బాబుకు ఆ ఫిరాయింపులే కొంప ముంచుతున్నాయి. నియోజక వర్గాల్లో నాయకులమధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మొదటినుంచి పార్టీకోసం కష్టపడుతున్నా బాబు గుర్తించడంలేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఫిరాయింపు నేతలనే అందలం ఎక్కిస్తుండటంతో తమ్ముల్లు రగిలిపోతున్నారు.
తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లాకు చెందిన పార్టీ నాయకుల తీరుపై స్ధానిక ఎమ్మెల్యే జయరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నమ్మి టీడీపీ కండువా వేసుకుంటే, ఎస్సీ ఎమ్మెల్యే అని అగ్రవర్గాలవారు అణగదొక్కే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారాం రావాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లతో కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన వెల్లడించారు.