దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విజయనగరం జిల్లా అభివృద్ధి చెందిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాదయాత్ర చేస్తున్న జగన్ పార్వతీపురం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబుపై నిప్పులు చెరిగారు.
ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు విస్మరించారని… 80వేల ఎకరాలకు ఇప్పటి వరకు సాగునీరు అందలేదని రైతులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలంతా దోపిడీకే పరిమితమయ్యారని అన్నారు. అగ్రిగోల్డ్ కు చెందిన విలువైన ఆస్తులను చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు కాజేస్తున్నారని దుయ్యబట్టారు.
దాడి అనంతరం వైద్యుల సూచన మేరకు జగన్ 17 రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈనెల 12 నుంచి విజయనగరం జిల్లాలో పాదయత్రను పున:ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రస్తుతం పార్వతీపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య విపరీతంగా ఉందన్నారు. మూడు రోజులకోసారి మంచినీరు వస్తుందని ఆ నీరు కూడా బురద నీరు అంటూ ప్రజలు వాపోతున్నారని జగన్ అన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ముఖ్యంగా హాయ్ లాండ్ ను దోచుకునేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు అగ్రిగోల్డ్ యాజమాన్యంకు చెందిన హాయ్ లాండ్ నేడు కాదంటూ తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు, సీఐడీ అధికారులు కుమ్మక్కై ఆస్తులను కొట్టెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదన్నారు. అది చేశా ఇది చేశా అంటూ మనవడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని జగన్ మండిపడ్డారు. పోలవరం బాబు అవినీతికి అడ్డాగా మారిందన్నారు.
మరోవైపు అమరావతి రాజధాని పేరుతో భూదోపిడీకి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప రాజధానిని నిర్మిస్తానని చెప్తూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. కేవలం ఎన్నికలు నాలుగు నెలలు ఉండగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటూ సినిమా చూపిస్తున్నారని మండిపడ్డారు.