2019 ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు జగన్. ఇప్పటికే ఎన్నికల సర్వేలు అన్నీ కూడా జగన్ గెలుపు ఖాయం అన్నీ తేల్చేస్తున్న నేపథ్యంలో 2014లోలాగా అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తున్నాడు జగన్. అన్నింటికీ మించి జగన్ ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న అశేష ప్రజాదరణ, వైకాపాలోకి నాయకుల చేరికలు కూడా జగన్లో ఉత్సాహం నింపుతున్నాయి. మరోవైపు చంద్రబాబు రోజు రోజుకూ బలహీనపడుతూ ఉండడం కూడా వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.
తాజాగా 2019 ఎన్నికల్లో వైఎస్ షర్మిళ పోటీ చేయడం ఖాయమని తేల్చేశాడు జగన్. 2019 ఎన్నికల్లో ఏదో ఒక ఎంపి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుంది షర్మిళ. ఇంతకుముందు విజయమ్మ ఓడిపోయిన విశాకపట్టణంలో ఇప్పుడు బిజెపి, టిడిపిలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది. కురసాల కన్నబాబు లాంటి సీనియర్ నాయకులు కూడా వైకాపాలో చేరనుండడం విశాఖ వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ నేపథ్యంలో విజయమ్మ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడి నుంచే షర్మిళను గెలిపించుకుని సత్తా చాటాలని జగన్ భావిస్తున్నాడు. మరోవైపు వైకాపాకు పూర్తి స్థాయిలో పట్టున్న ఒంగోలు, కడప నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయినా షర్మిళను పోటీకి నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ, ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డిని కానీ ఎన్నికల పోటీ నుంచి తప్పించి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు జగన్. అదే జరిగితే మాత్రం ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షర్మిళ పోటీ ఖాయం. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పోరాడడానికి ఇంగ్లీష్ బాగా తెలిసిన, కాస్త పోరాడే నైజం, కలుపుగోలు తత్వం ఉన్న ఎంపిలు కావాలని జగన్ భావిస్తున్నాడు. అందుకే వైఎస్ షర్మిళను రంగంలోకి దింపాలని జగన్తో పాటు వైకాపా నేతలు కూడా అభిప్రాయపడ్డారట. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ నాట సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిళపై ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఒక మహిళా నేత ఆ స్థాయిలో పాదయాత్ర చేయడాన్ని అప్పట్లోనే చాలా మంది అభినందించారు. ఇక వైఎస్ కూతురిగా కూడా మంచి గుర్తింపు ఉన్న వైఎస్ షర్మిళ ఎన్నికల బరిలో దిగితే వైకాపా నాయకులకు, శ్రేణులకు, వైఎస్ అభిమానులకు కొత్త ఉత్సాహం వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.