అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా, వైసీపీ డిజిటల్ పోరాటంలో భాగమైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కొందరు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినవారిని కాదని కొత్తవారిని అందలమెక్కిస్తారా అని సోషల్ మీడియా సైనికులు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా అబద్ధపు ప్రచారాల నుంచి వైసీపీని బయటపడేసి, వైఎస్ జగన్కు అధికారం సిద్ధించేలా కృషి చేసిన సోషల్ మీడియా కార్యకర్తలను ఏమాత్రం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సోషల్ సైనికుల బాగుకోసం ఒక్క పనీ చేయలేదని పంచ్ ప్రభాకర్ తన యూట్యూబ్ చానెల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక్కరినైనా ఆదుకున్నారా
వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీగా ఉన్న వ్యక్తి బుడబుక్కల రాజకీయాలు చేస్తున్నారని ప్రభాకర్ మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో, ఆయన తనయుడు జగన్ వెంట నడిచామని తెలిపారు. వైఎస్ జగన్ పచ్చ పార్టీ కుట్రల చక్రబంధంలో ఇరుక్కుంటే అండగా నిలిచామని గుర్తు చేశారు. రేయింబవళ్లు కష్టపడి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తెస్తే.. కనీసం ఒక ఓటరుకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. వైసీపీ గెలుపు కోసం, సోషల్ మీడియా ప్రచారంలో పార్టీని ఉన్నత స్థానంలో నిలపడం కోసం ఉన్న ఉపాధిని కోల్పోయి రోడ్డునపడ్డ సోషల్ మీడియా సైనికులను ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీల ఫిర్యాదులతో కేసుల్లో ఇరుకున్నవారిపట్ల ఇలాగేనా ప్రవర్తించేది అని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో మరింత అవసరం
కష్టపడి అధికారాన్ని కట్టబెడితే.. సమన్వయంతో ముందుకు వెళ్లకుండా మీలో మీరు కుమ్ముకోవడం సిగ్గు చేటని ప్రభాకర్ చురకలు వేశారు. రాజకీయంగా అందరికంటే ముందుండి ఎన్నికల్లో విజయవంతమవ్వాలంటే సోషల్ మీడియా తప్పకుండా సోషల్ మీడియా సాయం అవసరమని అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఏమేరకు కష్టపడ్డారో.. అంతేస్థాయిలో సోషల్ కార్యకర్తలు కూడా వైసీపీ సక్సెస్ కావడానికి కారకులయ్యారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టడంతో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి డిజిటల్ దన్ను అవసరమని ప్రభాకర్ నొక్కి చెప్పారు. ఇకనైనా వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని నిర్వహిస్తున్న పెద్దలు సోషల్ మీడియా కార్యకర్తల మంచి కోసం ముందుకు రావాలని కోరారు. అంతేగానీ, అది చేస్తాం, ఇది చేస్తామని మభ్యపెట్టే మాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.