తెలంగాణా సీఎం చంద్రశేఖర్రావు ప్రాజెక్టుల బాట పట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించేందుకు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రాజెక్టుల పరిపూర్తికి నిర్మాణ సంస్థలు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా క్షణమాలస్యం చేయకుండా అందిస్తాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రెండో రోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. రామగుండం నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్.. అక్కడ ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 8వ యూనిట్ పనులను పరిశీలించారు. అక్కడ్నుంచి.. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలనకు సీఎం బయల్దేరారు. మేడారం ప్యాకేజీ 6, రామడుగు ప్యాకేజీ 8 ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్లను, సర్జ్పూల్స్, సబ్స్టేషన్లు, స్విచ్యార్డులను సీఎం పరిశీలించారు. 10 డయామీటర్ల డీ ఆకారపు వ్యాసార్థంతో నిర్మించిన మేడారం టన్నెల్ను కూడా పరిశీలించారు.