దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం వెలుగులోకి వచ్చింది. ట్యాంపరింగ్ చేశామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ బహిరంగంగా చెప్పడంతో దుమారం రేగింది. దీనిపై ఖటిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని కూడా చెప్పడంతో వారిమీద కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్దమయ్యింది క్రికెట్ ఆస్ట్రేలియా.
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో దేశ ప్రతిష్ట మసకబారడంతోపాటు తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని ప్రధాని ఆవేదన చెందారు. క్రికెట్లో స్లెడ్జింగ్కు ముగింపు పలకాలని మాల్కమ్ టర్న్బుల్ తాజాగా సూచించారు. ప్రస్తుతం స్లెడ్జింగ్ అదుపు తప్పిందని, ఆటను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బాల్ ట్యాంపరింగ్ ఘటనపై విచారణలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహరంలో బాధ్యులపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టర్న్బుల్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ.. స్లెడ్జింగ్కు దిగడాన్ని అధికారులు అరికట్టాలని క్రికెట్ను మళ్లీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ఇది తప్పనిసరని ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు. ‘స్లెడ్జింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటలో దూషణకు చోటు ఉండొద్ద’ని టర్న్బుల్ అభిప్రాయపడ్డారు.