ప్రపంచకప్ ముగిసిపోయినా బంగ్లాదేశ్ మాత్రం ఆ మూడ్ నుంచి బయటకు రావడం లేదు. ఒకింత సంచలనం నమోదు చేసి ఆసీస్ లో జరిగిన ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్ వరకూ వచ్చి బంగ్లా టీమ్ ఆ మ్యాచ్ లో ఇండియాతో తలపడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో ఓటమిని బంగ్లా ఒప్పుకోలేదు!
ఇండియాతో మ్యాచ్ అంపైరింగ్ అధ్వానంగా ఉందని.. అంపైరింగ్ మోసంతోనే తాము ఓటమిపాలయ్యామని బంగ్లాదేశ్ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. కేవలం ఆటగాళ్లే కాదు.. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియా ఐసీసీని ప్రభావితం చేసి.. అంపైర్ల ను తమకు అనుకూలంగా మలుచుకొందని.. దీంతోనే తాము ఓటమి పాలయ్యామని బంగ్లాదేశ్ వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు ముస్తఫా కమల్. ఈయన ఐసీసీ అధ్యక్ష హోదాలో ఉండి.. అంపైర్లపై అనుమానాలు వ్యక్తం చేశాడు.
ఏదో సగటు బంగ్లాదేశీయుడు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తంచేసి ఉంటే.. సర్దుకుపోవచ్చు కానీ.. ఐసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటంతో ఐసీసీలోనే అసంతృప్తి కనిపించింది. దీంతో ఈయనను ప్రపంచకప్ ట్రోఫీ ఫైనల్ రోజున ప్రెజెంటేషన్ సెర్మనీకి దూరం పెట్టారు. దీనిపై కమల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంతలోనే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
తాజాగా ఈయన రాజీనామాను ఆమోదిస్తూ ఐసీసీ ప్రకటన చేసింది. అయితే తన రాజీనామాకు ఎవరినీ కారణంగా చెప్పలేదు కమల్. తన వ్యక్తిగత కారణాల చేతే ఆ పదవి నుంచి తప్పుకొంటున్నట్టుగా ప్రకటించాడు. కానీ అసలు కారణం అయితే క్వార్టర్స్ మ్యాచే అనుకోవాల్సి వస్తోంది.