హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడు మరో సారి వివాదంలో చిక్కుకున్నాడు. . కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో అంపైర్ నిర్ణయంతో విభేదించడం పట్ల వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. అంబటి రాయుడితోపాటు జట్టు మేనేజర్ కిషన్ రావుకు కూడా బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివిరన ఇవ్వాలని బీసీసీఐ కోరింది.
జనవరి 11న విశాఖ వేదికగా కర్ణాటకతో జరిగిన టీ20 మ్యాచ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో అంపైర్ తప్పిదం వల్ల గందరగోళం నెలకొంది. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ మిడ్ వికెట్ మీదుగా ఆడి రెండు పరుగులు తీశాడు. ఫీల్డర్ మెహదీ హసన్ బంతి బౌండరీ దాటకుండా ఆపాడు. కానీ ఆ క్రమంలో బౌండరీ రోప్ను తాకాడు. ఈ విషయం గమనించని అంపైర్ బౌండరీ ఇవ్వలేదు. తర్వాత రిప్లేలో అది బౌండరీ అని తేలింది. దీంతో మ్యాచ్ అనంతరం తమకు రెండు పరుగులు కలపాల్సిందేనని కర్ణాటక కెప్టెన్ పట్టుబట్టాడు.
దీంతో హైదరాబాద్ లక్ష్యాన్ని 204 నుంచి 206కు పెంచారు. కానీ మేం మాత్రం 204 పరుగుల లక్ష్యంతోనే ఆడతామని అంబటి రాయుడు అంపైర్లకు తెలిపాడు. 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కోసం సన్నద్ధం కావడం కోసం మ్యాచ్ అనంతరం హైదరాబాద్ క్రికెటర్లు చాలా సేపు గ్రౌండ్లో ఉండిపోయారు. కానీ అంపైర్లు మాత్రం రెండు పరుగుల తేడాతో కర్ణాటక గెలుపొందినట్లు ప్రకటించారు.