ఇంగ్లాండ్తో మూడో టెస్టులో భారత్ గెలుపు అంచుల్లో నిలిచింది. ఇంకొక్క వికెట్ తీస్తే మ్యాచ్ భారత్దే. ప్రత్యర్థి గెలవాలంటే ఇంకా 210 పరుగులు కావాలి. కాని భారత్ ను విజయం వరించాలంటే ఒక వికెట్ తీస్తే చాలు. చివరి రోజు భారత్ విజయం లాంఛనమే కావచ్చు. కాని విజయం నేటికి వాయిదా పడింది.
521 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు, మంగళవారం ఆట ఆఖరుకు 311/9తో నిలిచింది. కుప్పకూలేలా కనిపించిన ఇంగ్లాండ్ను బట్లర్ (106; 176 బంతుల్లో 21×4), స్టోక్స్ (62; 187 బంతుల్లో 6×4) స్ఫూర్తిదాయక పోరాటంతో ఆదుకున్నారు. భారత బౌలర్లలో బుమ్రా (5/85), ఇషాంత్ (2/70) చక్కటి ప్రదర్శన చేశారు. రషీద్ (30), అండర్సన్ (8) క్రీజులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం.
ఓవర్నైట్ స్కోరు 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.ఆట తొలి ఓవర్లోనే వికెట్ పడింది. ఇషాంత్ బౌన్స్ జోడించి విసిరిన బంతి.. జెన్నింగ్స్ (13) బ్యాట్ అంచును తాకి వికెట్ కీపర్ పంత్ చేతుల్లో పడింది. తన తర్వాతి ఓవర్లో ఇషాంత్ మరో ఓపెనర్ కుక్ (17)ను స్లిప్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. రూట్ (13), పోప్ (16) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఐతే వీళ్లిద్దరూ వరుస ఓవర్లలో ఔటైపోవడంతో ఇంగ్లాండ్ 62/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత మూడో ఓవర్లోనే వికెట్ లభించింది. వికెట్ కోసం సుదీర్ఘ సమయం సాగిన నిరీక్షణకు బుమ్రా తెరదించాడు. అతడి బంతిని ఆడకుండా బట్లర్ చేతులెత్తేయగా అది నేరుగా ప్యాడ్లను తాకింది. అంపైర్ ఔట్గా ప్రకటించినా బట్లర్ రివ్యూ కోరాడు. అయితే లాభం లేకపోయింది.
గాయంతో ఇబ్బంది పడుతున్న బెయిర్స్టో (0)ను తర్వాతి బంతికే బౌల్డ్ చేశాడు బుమ్రా. కాసేపటికే వోక్స్ (4)నూ అతనే పెవిలియన్ చేర్చాడు. స్టోక్స్ పోరాటానికి పాండ్య తెరదించడంతో ఒక దశలో ఇంగ్లాండ్ 241/8తో పతనం అంచున నిలిచింది.
కొద్ది సేపటికి రషీద్ను కూడా బుమ్రా ఔట్ చేసినా అది ‘నోబాల్’గా తేలింది. ఈ దశలో దూకుడుగా ఆడిన రషీద్, బ్రాడ్ జోడీ తొమ్మిదో వికెట్కు 50 పరుగులు జోడించింది. ఎట్టకేలకు బ్రాడ్ను ఔట్ చేసి బుమ్రా ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రషీద్ బలంగా నిలబడటంతో భారత్ నిరాశగా పెవిలియన్ చేరింది.