పాకిస్తాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది . పదేపదే కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ కవ్విస్తున్న పాక్.. ఈ సారి మరీ బరితెగించింది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ.. పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు భారత జవాన్లపై దాడి చేసి అత్యంత క్రూరంగా వారి తలలు నరికేసింది. ఉగ్రవాదుల సాయంతో సరిహద్దుల్లో భారత సైన్యంపై దాడులకు తెగబడుతున్న పొరుగుదేశం.. ఈసారి ఏకంగా ఆర్మీనే రంగంలోకి దించి దొంగదెబ్బ కొట్టింది.
పాక్ సైన్యం ఓవైపు సరిహద్దు వెంబడి భారత పోస్టులపై మోర్టార్లతో దాడికి తెగబడగా.. పాక్ సరిహద్దు భద్రతా దళం (బీఏటీ) బృందం 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆదివారం రాత్రి నుంచి యథేచ్చగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్ను కవ్వించిన పాక్.. సోమవారం ఉదయం జవాన్లను కిరాతకంగా చంపేసింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత జవాన్ల తలలు నరికిన పాక్ ఆర్మీ చర్య అనాగరికమని భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. పాకిస్తాన్కు దీటైన సమాధానం ఇవ్వక తప్పదన్నారు. కాగా పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిసింది.
ఇండియన్ ఆర్మీ అన్నట్లుగానే కశ్మీర్ పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్ నియంత్రణ రేఖ దాటి వచ్చి మరీ ఇద్దరు భారత జవాన్ల దేహాలను ఖండఖండాలుగా నరికి ఛిద్రం చేసిన పాకిస్థాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ దీటైన సమాధానం చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి కృష్ణ ఘాటీ సెక్టార్ కు సమీపంలో ఉన్న పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పింపల్, కిర్ పాన్ బంకర్లను భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఈ బంకర్లలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కొల్పోయారు. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని పాకిస్థాన్ కు భారత ఆర్మీ తీవ్ర హెచ్చరికలు పంపింది.
Related