సినీ పరిశ్రమలో సరికొత్త జోనర్
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొత్త తరహా జోనర్ వచ్చింది. ఇన్నాళ్లు ఫాక్షనిజం, మాస్, ప్రేమ చివరకు హర్రర్ చిత్రాల ట్రెండ్ నడించింది. ఇప్పుడు జీవిత కథల చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలపై తీస్తున్న సినిమాలు వెండితెరపై బాగా ఆడుతున్నాయి. కలెక్షన్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ జోనర్ సేఫ్ జోన్గా నిర్మాతలు భావిస్తుండడంతో ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇన్నాళ్లు హర్రర్ సినిమాలు ట్రెండ్ కొనసాగగా ఇప్పుడు బయోపికిల సమయం వచ్చేసింది.
నిర్మాతలు కూడా రియల్ స్టోరీలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు భారత క్రికెట్ ఆటగాళ్లు ధోనీ, సచిన్ టెండూల్కర్ల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చాయి. ఇందులో భాగంగానే ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ ని నిర్మిస్తున్నారు. అంతకముందు బాలీవుడ్లో సిల్క్ స్మిత జీవిత చరిత్రపై వచ్చిన సినిమా సూపర్గా ఆడింది. ఆ తర్వాత ఎన్నో జీవిత చరిత్ర సినిమాలు బాలీవుడ్, టాలీవుడ్లో వచ్చాయి.. వస్తున్నాయి.
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఈ తరహా ట్రెండ్ బీభత్సంగా ఉంది. అయితే ఈ బయోపిక్లలో కూడా భిన్నమైన పరిస్థితి తెలుగులో ఉంది. ఒకే వ్యక్తి గురించి భిన్న కోణాల్లో ఇద్దరుA ముగ్గురు సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై ఆయన తనయుడు బాలకృష్ణ ఒక సినిమా తీస్తుండగా, రామ్గోపాల్ వర్మ మరో సినిమా `లక్ష్మీస్ ఎన్టీఆర్`, కేతిరెడ్డి మరో సినిమా తీస్తామని ప్రకటించారు. ఈ తరహా కొనసాగుతున్నాయి. త్వరలో సానియా మీర్జా, పీవీ సింధు, ఇందిరాగాంధీల జీవిత చరిత్రలపై సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలను నమ్ముకొని దర్శక, నిర్మాతలు లబ్ధి పొందాలని చూస్తున్నారు.