ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టంతా ఇప్పుడు అధికారుల తరలింపుపైనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను, ఆయా శాఖల కార్యాలయాలను వీలైనంత త్వరగా ఆంధ్రాకి తరలించాలని ఆయన భావిస్తున్నారు. ఉద్యోగులందరూ వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్రాకి చేరుకోవాల్సి ఉంటుందనీ, ఆ మేరకు కొన్ని త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలంటూ గతంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు పరిపాలన మరింత మెరుగ్గా ఉండాలంటే వీలైనంత త్వరగా సచివాలయాన్ని ఆంధ్రాకి తలరించాలని భావిస్తున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయ తరలింపునకు సంబంధించి చంద్రబాబు తన అభిప్రాయాన్ని క్లియర్ కట్గా చెప్పారని తెలుస్తోంది.లక్ష చదరపు అడుగుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరగా సచివాలయాన్ని విజయవాడకు తరలించనున్నట్టు చెప్పారట.
తాను ఒక్కడినే విజయవాడలో కూర్చుంటే పరిపాలన సాగదనీ, అలాగే అధికారులందరూ హైదరాబాద్లో ఉంటే ఆంధ్రాలో పాలన ఎలా సాగుతుందని అభిప్రాయపడ్డట్టు సమాచారం. సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలు కావాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు వీలైనంత త్వరగా ఏపీకి తీసుకెళ్లిపోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు అర్థమౌతోంది. ప్రస్తుతం కిం కర్తవ్యం ఇదే అన్నట్టు తెలుస్తోంది.
అయితే, వాస్తవంగా చూసుకుంటే భారీ భవనాలను త్వరగా పూర్తి చేసేందుకు భారీ టెక్నాలజీ కావాలి. అందుకు కావాల్సిన నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయన్నదే ప్రశ్న. వచ్చే ఏడాదిలో అమలు చేసేందుకు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలను కూడా దేశం సర్కారు డిజైన్ చేసేస్తోంది. ఇంకోపక్క సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖల తరలింపు అంటోంది. కానీ, ఆంధ్రాలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు మాత్రం ఇంతవరకూ మొదలుకాలేదు.
మరి, చంద్రబాబు మాటల్లో మాత్రం రేపోమాపో తరలింపు అన్నట్టుగా ధ్వనిస్తోందనీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రాలో ఏ ఏర్పాట్లు లేకపోయినా హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు బాగానే టెన్షన్ పెంచేస్తున్నారని అంటున్నారు. ఆంధ్రా వెళ్లడానికి సిద్ధం కావాలని ప్రకటిస్తున్నారే తప్ప, అక్కడి సౌకర్యాల ఏర్పాటుపై మాట్లాడటం లేదని కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, వాటి గురించి కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా!