- దుబాయ్లో ఆలస్యమవుతున్న ప్రక్రియ
- మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణ
మూడు రోజుల ఎదురుచూపులు.. ఆమె కోసం భారతదేశమంతా ఎదురుచూస్తోంది.. గంటల పాటు నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆమెను కడసారి చూడాలనుకునే అభిమానులకు ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శ్రీదేవి భౌతికకాయం తరలింపు ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. శ్రీదేవిని తమ విచారణ పూర్తయ్యే లోపు తాము మృతదేహం అప్పగించలేమని దుబాయ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు మంగళవారం కూడా శ్రీదేవి భారతదేశానికి వచ్చే అవకాశం లేదు. ఆమె మరణించడమేమో కానీ ఈ ఆలస్యంతో ప్రేక్షకాభిమానులు కలత చెందారు. అంతటి వ్యక్తికి ఇన్నేసి గంటలు విచారణ పేరుతో మృతదేహం అప్పగించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి చనిపోయి మూడు రోజులు అయ్యింది. ఇంకా మార్చురీలో ఉండిపోయింది కానీ అభిమానుల మధ్యకు రాలేదు. శనివారం రాత్రి చనిపోతే.. మంగళవారం కూడా భారత్ కు మృతదేహం రాకపోవడం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం (ఫిబ్రవరి 27) కూడా భారతదేశానికి వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు.. ప్రాసిక్యూషన్ అధికారులకు అప్పగించారు. దీంతో ప్రాసిక్యూషన్ అధికారి భారత్ మీడియాతో మాట్లాడుతూ… ఫోరెనిక్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాదవశాత్తు జరిగిందేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. లోతైన విచారణ అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని పత్రాలు కావాలని భారత్ కాన్సులేట్ను కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి మృతదేహాన్నిఈరోజు మంగళశారం అప్పగించలేమని ప్రకటించారు.
భర్త బోనీ కపూర్ను విచారణ కొనసాగిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్ విడిచి వెళ్లరాదని బోనీకపూర్కు ప్రాసిక్యూషన్ అధికారులు ఆదేశించారు. బాత్టబ్లో పడిపోయిన శ్రీదేవిని మొదట ఎవరు చూశారనే అంశంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోనీకపూర్ ఆ టైంలో ఎక్కడున్నారు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఏం జరిగిందనేదానిపై దర్యాప్తు సాగుతోంది. ఇదంతా తెలిసిన ఏకైక వ్యక్తి బోనీ కపూర్ అని భావిస్తున్నారు.