ఏపీలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు పొడిచిన దగ్గరి నుండి పవన్ పార్టీ సంగతి పక్కన పెడితే టీడీపీ నేతలు మాత్రం ఒకింత ధైర్యంతోనే ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీల పొత్తులో లాభపడేది టీడీపీనే అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇది పవన్కు ఎప్పుడు అర్ధం అవుతుందోనన్న సంగతి పక్కన పెడితే..ఇప్పుడు ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశం పలుచోట్ల రసాభాసాగా మారుతున్నాయి. ఎందుకంటే పొత్తులో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది ? పోటీచేసే నియోజకవర్గాలు ఏవి ? అన్న దానిపై క్లారిటీకి రాకుండా సమన్వయ కమిటీ సమావేశం పేరుతో వస్తే ఇబ్బందికరంగా ఉందని ఇరు పార్టీల నేతలు వాపోతున్నారు.
ఎందుకంటే ఈ రెండు పార్టీలు మా కంటే మాకని డిమాండ్ చేస్తున్న స్థానాలు చాలానే ఉన్నాయి. సమన్వయ కమిటీ వేసుకున్నా టీడీపీ – జనసేన నేతలు వేర్వేరుగానే ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో సీట్ల షేరింగ్లో ఏదో ఒక పార్టీకి దెబ్బ పడటం ఖాయమని అది టీడీపీ కంటే ఎక్కువగా పవన్కే నష్టమని తెలుస్తోంది.
ప్రధానంగా రెండు పార్టీల మధ్య తిరుపతి, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, బద్వేలు, కడప, రాజంపేట, తెనాలి, భీమిలీ, పిఠాపురం, పీ గన్నవరం, విశాఖపట్నం ఉత్తరం, పెందుర్తి, విజయవాడ సెంట్రల్, కాకినాడ, రాజమండ్రి లాంటి స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఎవరికి టికెట్ దక్కినా మిగితా వారి నుండి మద్దతు లభించడం అంత సులభం కాదు. దీనికి తోడు చంద్రబాబు, లోకేష్ చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించగా పవన్ సైతం చాలామంది నేతలకు మాటిచ్చేశారు. ఈ నేపథ్యంలోనే సీటు దక్కేది ఎవరికి,పోటీలో ఉండేది ఎవరో తెలియక అయోమయంలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు.