ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇక అధికార వైసీపీ వైనాట్ 175 పేరుతో దూసుకుపోతోంది. ఏ పార్టీతో పొత్తు లేదని ఇప్పటికే ప్రకటించింది కూడా. ఇక త్వరలో బస్సుయాత్ర ద్వారా ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ – జనసేన కూటమికి అంతా తానై వ్యవహరిస్తున్నారు పవన్. అయితే బాబు జైలు నుండే డైరెక్షన్ ఇస్తున్న బయటమాత్రం పవన్ మార్గదర్శనంలోనే రెండు పార్టీల నేతలు ముందుకు కదులుతున్నారు.
ఇంతవరకు క్లారిటీగానే ఉన్న టీడీపీ – జనసేన పొత్తులో బీజేపీని కలుపుకునేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి తొలుత జనసేన – బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. ఇక మోడీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి భేటీకి హాజరయ్యారు పవన్. ఈ క్రమంలో ఈ కూటమిలో చంద్రబాబును కలుపుకోవాలని ఆలోచన చేసిందే పవన్. దానిని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ అయినా బీజేపీ కాస్త దూరం జరగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక ఒకానొక దశలో టీడీపీ కోసం బీజేపీని వదులుకునేందుకు సిద్ధమయ్యారు పవన్. అందుకే కృష్ణాజిల్లా వారాహియాత్రలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేశానని తర్వాత 24 గంటల్లో తాను ఎన్డీఏలోనే ఉన్నానని చెప్పారు. దీంతో టీడీపీ – బీజేపీ మైత్రి బంధంలో పవనే కీలకమని అందరికి అర్ధమైపోయింది. ఒకవేళ బీజేపీ ఈ కూటమిలో చేరని పక్షంలో వామపక్షాలు రెడీగా ఉండగా దీనిని పవనే ఫైనల్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో పొత్తుల రాజకీయాలు చర్చనీయాంశంగా మారిన వైసీపీ మాత్రం సింహం సింగిల్గానే వస్తుందంటూ టాప్గేర్లో దూసుకుపోతోంది.