నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనె కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుపరిపాలన అందించే దిశగా మొదటి అడుగు వేశారు. తన టీమ్ను నియమించుకొనె పనిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానె చంద్రబాబు టీమ్ పై బదిలీ వేటు పడింది. వీరిని పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎంవో ప్రత్యేక కార్యదర్శి సతీష్ చందర్, ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, కార్యదర్శుల హోదాలో కొనసాగుతున్న గిరిజా శంకర్, అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు వేశారు.ఒకేసారి నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం టూరిజం రాష్ట్ర కార్పోరేషన్ ఎండీగా ధనుంజయరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు టీమ్గా చెప్పుకునే అధికారులపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ బదిలీ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కొత్త నాయకులు… తమ ఆలోచనలకు అనుగుణంగా పని చేసే అధికారులకు సీఎంవో స్థానం కల్పిస్తుంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రక్షాళన చేపడతానని ప్రకటించిన ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… మొదటగా సీఎంవో ఆఫీసు నుంచె మొదలు పెట్టారు.