ఏపిలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి వందల నుంచి వేల సంఖ్యకు కరోనా కేసులు పెరిగిపోయాయి. ఇక తిరుపతిలో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రచారాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ ఓటర్లకు జగన్ బహిరంగ లేఖ రాశారు.
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే 496 కేసులు నమోదయ్యాయని, నెల్లూరు జిల్లాలో కూడా 292 కేసులు వచ్చాయన్నారు.
ఇవాళ కరోనా బులెటిన్ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. ‘‘మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది’’ అని లేఖలో రాశారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని, ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండె నిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నా.
నా సోదరుడు డాక్టర్ గురుమూర్తిని.. గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ (2.28 లక్షలు) కన్నా ఇంకా ఎక్కువగా.. ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తారని, ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ.. అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకు, మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. వాటిని గమనించి తన సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కుళ్లు రాజకీయాలు మానేయాలి ‘వకీల్ సాబ్ ’పై పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్..!