ఇప్పటికే ఏపీ లో 12 శాతం పైగా వృద్ధి సాధించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆర్ధిక మంత్రి యనమల చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ వారు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం ఎత్తారు. తప్పుడు లెక్కలతో ప్రజలని మోసం చెయ్యడం ఆపాలి అని ఆయన కోరారు. వృద్ధిలో పురోగతి నమోదైతే రెవెన్యూలో కనిపిస్తుందని బొత్స సత్యనారాయణ వివరించారు. నిరుడు రెవెన్యూ వృద్ధి చూస్తే 25.9 శాతమని – 7.3 శాతం జీడీపీగా నమోదైందన్నారు.
రెవెన్యూ ట్రెజరీలోకి వస్తుందని ట్రెజరీలో డిపాజిట్ అవుతాయన్నారు. పదిశాతం కంటే ఒక్కశాతం కూడా రెవెన్యూ వృద్ధి కాలేదన్నారు. ప్రతినెలా వచ్చిన రెవెన్యూ ఆదాయాన్ని ప్రజల ముందు ఉంచాలని బొత్స కోరారు. రాష్ట్రంలో రబీ పంట రెండేళ్లుగా తగ్గిపోతుందని దీనికి కారణాలను వివరించాలన్నారు. 2014-15లో 13 లక్షల హెక్టార్లు – 2015-16లో 12 లక్షల హెక్టార్లు – 2016-17లో 9.21 లక్షల హెక్టార్లలో రబీ పంట విస్తీర్ణం తగ్గిందన్నారు. వ్యవసాయం – పరిశ్రమలు – ఉపాధి రంగాల్లో ఒక్క శాతం కూడా వృద్ధి నమోదు కాలేదన్నారున.
అంకెలను తారుమారు చేసి చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏఏ పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పారిశ్రామిక తయారీ రంగంలో 8.52 శాతం వృద్ధి రేటు నమోదైందని 99 వేల కోట్ల పెట్టుబడులతో 456 సంస్ధలు నెలకొల్పినట్లు చెప్పారని ఇవన్నీ కాగితాలకే పరిమితమని బొత్స అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటే కొత్త పరిశ్రమలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదని దీంతో ఆ రంగంలో స్తబ్ధత నెలకొని ఉందన్నారు.