కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో బాధ్యులుగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయడం వంటి డిమాండ్లలో ఆసుపత్రిలోనే దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు అనాగరికం అని వైసిపి నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. ఆయన తన జాతి కోసం పోరాడుతూంటే కొందరు మంత్రులు ఆయనను అవమానిస్తూ మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు.
ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ఆయన చేసిన వైద్య పరీక్షలు బాగానే ఉన్నాయని మంత్రులు వ్యంగ్యంగా అనడం ఎంత వరకూ సబబని బొత్సా అన్నారు. ఎపి హోం మంత్రి చినరాజప్ప అయితే ఏకంగా ముద్రగడనే అరెస్టు చేస్తామంటూ మాట్లాడడం తగదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.
మరోవైపు ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉంది… అసలు ఆయన పరిస్ధితి ఏమిటి అనేది అటు అధికారులు కాని, ఇటు మంత్రులు కాని వివరించడం లేదని, ఇది దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి రోజురోజుకు జటిలం చేస్తున్నారని అన్నారు.