స్వాతంత్య్రయం వచ్చి నప్పటినుంచి కశ్మీర్ రావణకాష్టంలా మండుతూనె ఉంది. అటు ఉగ్రవాదులు..ఇటు సైన్యం మధ్య ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఉగ్రవాద కాల్పుల్లో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కశ్మీర్ సమస్యను పరిస్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. తాజాగా కాశ్మీర్ సంక్షోభానికి కేంద్రం ముందుడగు వేసింది.
ప్రధానంగా వేర్పాటు ఆందోళనలు, భారత సైన్యం తుపాకుల మోత, రాళ్లు విసిరే యువత, నడవని పాఠశాలలు, అప్రకటిత కర్ఫ్యూ.. గడిచిన ఏడాదిన్నర రోజులుగా కశ్మీర్లోయలో నిత్యం కల్లోల వాతావరణమే. దాదాపు వ్యవస్థలన్నీ కుప్పకూలిన కశ్మీర్లోయలో పరిస్థితులు తిరిగి చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రయత్నాలు ప్రారంభించింది.
గత ఏడాది జులైలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. ఆఅల్లర్లల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం పూనుకుంది. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్.. చర్చల ద్వారా మాత్రమే లోయలో నెలకొన్న అశాంతిని తొలగించడం సాధ్యమవుతుదని, ఆ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తున్నట్లు చెప్పారు.
కశ్మీరీలకు దగ్గరవ్వడం ద్వారానే వారి సమస్యలను పరిష్కరించొచ్చు’ అన్న ప్రధాని మోదీ మాటను అనుసరించి చర్చల ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమించారు. ఆయన.. భారత్ నుంచి విడిపోతామంటూ ఆందోళనలు చేస్తోన్న వేర్పాటువాదులతోనూ, రాజకీయ పార్టీలు, సంస్థలు, కీలక వ్యక్తులతోనూ చర్చలు జరిపి.. శాంతి పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తారు.
చర్చల సమయంలో వచ్చిన అందరి అభిప్రాయాలతోపాటు..ఆయన చేసె సూచనలను, సలహాలను కేంద్ర కేబినెట్ పరిగణలోకి తీసుకునే వీలుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో కశ్మీర్ వేర్పాటువాద ఆందోళనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటికైనా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమే.