ఎట్టకేలకు హైకోర్టు విభజనకు మోక్షం లభించింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ను బుధవారం నాడు కేంద్రం విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలతో ఇకపై రెండు తెలుగు రాష్ర్టాలకు వేర్వేరుగా హైకోర్టులు ఉండనున్నాయి. ఈ హైకోర్టులు జనవరి 1 నుంచి వేర్వేరుగా పనిచేయనున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడ ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు డిమాండ్ చేసింది.ఈ విషయమై పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో చర్చించారు. నాలుగేళ్ల విరామం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్ 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు.
మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 1500 మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను ఇరు హైకోర్టులకు కేటాయించనున్నారు.
ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులు..
జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ వెంకట నారాయణ, జస్టిస్ శేషసాయి, జస్టిస్ శేషాద్రి నాయుడు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గా ప్రసాద్రావు, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ శ్యాం ప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ వెంటక సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్ జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ గంగారావు
తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తులు ..
జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ కోదండరామ్ చౌదరి, జస్టిస్ శివశంకర్ రావు, జస్టిస్ షమీన్ అక్తర్, జస్టిస్ కేశవరావు, జస్టిస్ అభినందన్ కుమార్, జస్టిస్ అమర్నాథ్ గౌడ్.