ప్రత్యేక హోదాతో అట్టుడికిపోతున్న ఆంధ్రప్రదేశ్కి పుండుమీద కారం చల్లినట్లు కేంద్రం మరో బాంబు పేల్చింది. రాష్ట్రానికి రైల్వేజోన్ సాధ్యం కాదని మరోసారి తేల్చేసింది. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేకహోదాపై ఎన్డీఏ మోసం చేయడంతో టీడీపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం ఏపీకి రైల్వేజోన్ సాధ్యం కాదని కేంద్రం చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పేర్కొనడం తెలిసిందే.
ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైల్వేజోన్ వ్యవహారంలో చేతులెత్తేయడం గమనార్హం. ఏపీకి రైల్వేజోన్ రావడం ఖాయమని, దానిపై చర్చలు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ నేతలు చెప్పిన చెప్తున్న దాంట్లో నిజంలేదని తేలిపోయింది. మరి ఇప్పుడు ఈ విషయంపై చంద్రబాబు ఎలా ముందుకెల్తారో చూడాలి.