విశాఖపట్నాన్ని ఇక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హనుమంతవాకలో నిర్మించిన విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు విశాఖపట్నంలోని షీలానగర్లో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ ఆసుపత్రి వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 1.91 లక్షల కార్మిక కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందుతాయి. విశాఖలో నెలకొల్పిన విమ్స్ ను ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధన మేరకే ఈఎస్ఐ ఆసుపత్రికి 700 కోట్లు కేటాయించి దాన్ని 500 పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను సిఎం చంద్రబాబు పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందజేశారు.