అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీలో జరుగుతోన్న హిందుస్థాన్ లీడర్షిప్ సదస్సులో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ఒబామా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. బరాక్ ఒబామాను మరోసారి కలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. ఒబామా ఫౌండేషన్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక బంధాలు మరింత బలపడతాయని ఆయన అన్నారు.
అంతకు ముందు హిందుస్థాన్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ… భారత్, అమెరికా దేశాలు కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్యారిస్ ఒప్పందం కోసం నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమైందని తెలిపారు.
తమ దేశ నాయకత్వంలో దీనిపై కొంత సందిగ్ధత ఉందని చెప్పారు. ఈ పర్యావరణ ఒప్పందం అద్భుతమైన విజయమని చెప్పారు. ప్రజలు సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశాన్ని ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఒబామా అధ్యక్ష సమయంలో అమెరికాతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డ సంగతి తెలిసిందే.