కేరళను భారీ వరదలు, వర్షాలు కకలావికలం చేశాయి. ఈ వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కేరళలో రూ.20వేల కోట్ల నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కేరళలో సాధారణ వర్షపాతం కంటే 250 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మొత్తం 80 డ్యాముల్లో సామర్థ్యానికి మించి నీరు చేరింది.
వరల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పగలురాత్రి తేడా లేకుండా తీవ్రంగా కష్టపడుతున్నాయి. వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడటంలో అధికారులతో పాటు ఇస్రో కూడా తన వంతుగా పాలుపంచుకుంటోంది.
ఇస్రో రూపొందించిన ఓషన్ శాట్-2, రిసోర్స్ శాట్-2, కార్టో శాట్-2, కార్టోశాట్-2ఏ, ఇన్ శాట్-3డీఆర్ శాటిలైట్లు వరద పరిస్థితిపై అధికారులకు అత్యంత కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందిస్తున్నాయి. కేరళలో వరద పరిస్థితితో పాటు అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేయడంలో ఈ ఉపగ్రహాలు గణనీయంగా ఉపయోగపడుతున్నాయి.
కేరళలో వర్షం కురిశాక ఎక్కడ వరద వస్తుందో ఈ ఉపగ్రహాల ద్వారా ముందే అలర్ట్స్ పంపుతున్నారు. అలాగే శాటిలైట్లు అందిస్తున్న సమాచారంతో రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశముందో గుర్తించి అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.
కార్టోశాట్ ఉపగ్రహాలు వరద ప్రాంతపు ఫొటోలను హై రెజల్యూషన్ లో తీసి పంపిస్తే.. ఇన్ శాట్ 3డీఆర్ ఉపగ్రహం రియల్ టైమ్ ఇమేజింగ్ వ్యవస్థతో పాటు వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ తదితర అంశాలను గుర్తిస్తోందని ఓ అధికారి తెలిపారు. వీటి ద్వారా సాయం చేసేందుకు ఆర్మీకి, ఎన్డీఆర్ఎఫ్కు అవకాశం లభిస్తోంది. కేరళలో వరద పరిస్థితితో పాటు అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేయడంలో ఈ ఉపగ్రహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.