మళయాల సూపర్స్టార్ నటుడు మోహన్లాల్ భాజాపాలో చేరుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురష్కరించుకుని మోహన్లాల్ సోమవారం ప్రధాని మోదీని కలిశారు. ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని మోహన్లాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ప్రధాని మోదీని కలువడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు చెందిన విశ్వశాంతిఫౌండేషన్ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించానని తెలిపారు. నవ కేరళ నిర్మాణం కోసం భవిష్యత్తు ప్రమాణాళిక రూపొందించుకోవడానికి ఏర్పాటుచేసిన ‘గ్లోబల్ మలయాళి రౌండ్ టేబుల్’ సమావేశానికి హాజరుకావాలని నేను ప్రధానిని కోరాను. కేరళకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు.
https://www.facebook.com/ActorMohanlal/posts/1879385148783839
అయితే వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మోహన్లాల్ బీజేపీలో చేరబోతున్నారని, 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని ఆరెస్సెస్ గట్టిగా పట్టుబడుతోందని కథనాలు వస్తున్నాయి. తిరువనంతపురం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ నేత శశిథరూర్ ఎంపీగా ఉన్నారు. ఆయన మీద పోటీకి మోహన్లాల్ దింపాలని ఆరెస్సెస్ భావిస్తోంది. కేరళలో బీజేపీకి పెద్దగా పట్టులేదన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మలయాళం నటుడు సురేశ్ గోపీ బీజేపీలో చేరగా.. మోహన్లాల్ కూడా కమలం గూటికి చేరితే.. ఇక్కడ బలమైన పార్టీగా ఎదగవచ్చునని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.
ప్రధాని మోదీ సైతం మోహన్లాల్తో భేటీ అయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. మోహన్లాల్ ఎంతో వినయం కలిగినవారని, ఆయన చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దీంతో వీళ్ల భేటీపై ఊహాగానాలు మొదలైపోయాయి. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ భేటీ జరిగిందని విమర్శకులు అంటున్నారు.
Yesterday, I had a wonderful meeting with @Mohanlal Ji. His humility is endearing. His wide range of social service initiatives are commendable and extremely inspiring. pic.twitter.com/f3Dv3owHUV
— Narendra Modi (@narendramodi) September 4, 2018