రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గనిర్దేశనంలో విశ్వభారతి విశ్వవిద్యాలయం భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ జాతీయవాదానికి ఈ విద్యాలయం ముఖచిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు మోదీ. భారత్లోని ఆధ్యాత్మికత వల్ల మానవజాతి మొత్తం ప్రయోజనం పొందాలని ఠాగూర్ కోరుకున్నారని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
భారత్లో స్వాతంత్రోద్యమాలు అంటే 19, 20వ శతాబ్దాలే గుర్తుకు వస్తాయని.. కానీ, అంతకు చాలా ముందే ఈ ఉద్యమాలకు బీజం పడిందని మోదీ పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగిన ఆ ఉద్యమాల నుంచి లభించిన స్ఫూర్తి.. స్వాతంత్ర సంగ్రామానికి దోహదం చేసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తి ఉద్యమాన్ని ఉదహరించారు.