ఇప్పటివరకు ఏపీలో 3.03 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మీడియాతో మాట్లాడిన ఆయన..
మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుదారులలో ఇప్పటివరకు 3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.
40 వేల మంది పోలీసులు, 28 వేల మంది హోమ్ ఓటింగ్ కేటగిరీ ఓటర్లు, 31 వేల మంది సెక్టార్ అధికారులు, ఇతరులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. మే 3, 4 తేదీల్లో ఇంటింటికి ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఈనెల 5న విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు.
వివిధ కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోలేకపోయిన ఉద్యోగులు బుధవారం కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్లో అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రానికి బుధవారం పలువురు వీఐపీలు వస్తున్నారని, పోలీసులు, ఉద్యోగులు వీఐపీల సందర్శనలో బిజీగా ఉన్నందున మే 9న పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.