ఏపీలో విపక్షం ఇంతకు ముందెన్నడూ లేనన్ని కష్టాల్లో ఉంది. విపక్ష పార్టీ నుంచి ఏకంగా 17మంది ఎమ్మెల్యేలు చేజారిపోయిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. తొలిసారిగా నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వంలోనే అలాంటి పరిస్థితి దాపురించింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జగన్ ని విడిచి వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ జగన్ లో మాత్రం కించిత్ స్పందన కనిపించడం లేదు. మీడియా ప్రశ్నకు సమాధానంగా మరికొందరు కూడా వెళ్లిపోవచ్చంటూ చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు వీడిపోతున్న తర్వాత సహజంగా ఆయా పార్టీలలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. పార్టీ ఏమవుతుందన్నబెంగ శ్రేణుల్లో మొదలవుతుంది. కీలకనేతలు కూడా వెళ్లిపోతున్న తరుణంలో మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. పార్టీ పెద్దలకు సైతం కంగారు పడుతుంది. ఓ వైపు మీడియా, మరోవైపు అధికార పక్షం, మూడో వైపు నుంచి పార్టీని వీడి వెళుతూ అపరిచితుడు అంటూ సాగుతున్న దాడి ఇలా ముప్పేట దాడి సాగుతున్న దశలో ఏ పార్టీలో అయినా కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. అయితే వైఎస్సార్సీపీ తీరు మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఆపార్టీ అధినేతను అందరూ ఆడిపోసుకుంటున్నట్టుగా మొండితనమే ఇప్పుడు జగన్ కి ఆభరణంగా మారిందా అన్న అనుమానం కలుగుతోంది. జగన్ బలం , బలహీనతే అదేనా అన్న సందేహం చుట్టిముడుతోంది.
పార్టీ ఇన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా జగన్ వెనుకడుగు వేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఎదురుదాడితో చంద్రబాబునే చిక్కుల్లోకి నెడుతున్నారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటూ ప్రింట్ చేసిన బుక్ తో ఢిల్లీ లో నాలుగు రోజుల పాటు జగన్ అండ్ కో హల్ చల్ చేశారు. కేంధ్రమంత్రులు మొదలుకుని పలు జాతీయ పార్టీల నేతల వరకూ అనేకమంది అధికార, రాజకీయ ప్రముఖులను బాబు బండారం పట్టుకుని భేటీ అయ్యారు. దాంతో చంద్రబాబు మీద చాలామంది కస్సుమనే పరిస్థితి కనిపించింది. ఆతర్వాత మాచర్లలో కరువు సమస్య తీసుకుని కదం తొక్కారు. మండుటెండలో కూడా కనివినీ ఎరుగని స్థాయిలో జనం రావడంతో జగన్ మాచర్ల ధర్నా ఓ సంచలనంగా మారింది. ఆ తర్వాత బ్రాండిక్స్ కార్మికులకు మద్ధతుగా విశాఖ అచ్యుతాపురంలో ఆందోళనలో పాల్గొన్నారు.
నెలరోజుల డెడ్ లైన్ పెట్టి బాబు ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే తానే దీక్షకు దిగుతానని హెచ్చరించి వచ్చారు. ఆతర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కాకినాడ పయనమవుతున్నారు. అది ముగియగానే కర్నూలులో కృష్ణా జలాల సమస్య మీద గొంతెత్తబోతున్నారు. ఇలా వరుసగా కార్యక్రమాలు చేపడుతూ అధికార పార్టీనే ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయిలో ప్రతిపక్ష పయనం సాగుతోంది. దాంతో జగన్ ఆందోళనలకు సమాధానం ఇచ్చుకోవాల్సిన స్థితిలో అదికార పార్టీ పడిపోతోంది. బ్రాండిక్స్ గానీ, ఇప్పుడు జల సమస్య మీద ఉద్యమం గానీ జగన్ పిలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కదలడం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.గడ్డు పరిస్థితులున్నప్పటికీ అధిగమించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో చంద్రబాబుకి అననుకూల వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా సమస్య చంద్రబాబుని బోనులో నిలబెట్టింది. ఆయన అనుకూల మేథావులు, మీడియా పూర్తిగా బీజేపీని బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బాబు నేరం కూడా ఉందన్న అభిప్రాయం జనంలో బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా చంద్రబాబుని టార్గెట్ చేయడంతో డజన్నర ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్న ఆనందం చంద్రబాబుకి కనిపించడం లేదు. అసెంబ్లీలో ఆయన పార్టీ బలపడుతున్నప్పటికీ ప్రజల్లో వేగంగా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న పరిస్థితిని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దాంతో ఎమ్మెల్యేలను జగన్ కి దూరం చేయడం ద్వారా విపక్షాలు లేకుండా చేస్తానని శపథం చేసిన చంద్రబాబుకి ఈ పరిస్థితులు అంతగా రుచించే అవకాశం లేదు. గోడకు కొట్టిన బంతిలా విపక్ష నేత మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్న తీరు మింగుడుపడడం లేదు. జగన్ జోరు పెంచుతున్న తీరు అధికార పార్టీకి కంటగింపుగా మారుతోంది. కానీ జగన్ అనుచరుల్లో మాత్రం ఇది సంతృప్తినిస్తోంది. తమ నేత మడమ తిప్పడన్న మాటకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తుండడం మాత్రం కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తుందని చెప్పక తప్పదు.