భారత ప్రధాని నరేంద్రమోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా మూడు ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు. ఆఫ్రికా దేశాలయిన రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికాలలో పర్యటించనున్నారు.ముందుగా రువాండా వెల్లనున్నారు. తన పర్యటనలో భాగంగా రువాండా అధ్యక్షుడు కగామేకు మోదీ 200 ఆవులను బహుమతిగా ఇవ్వనున్నారు.
రువాండ ప్రజలు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అక్కడి గ్రామాల్లో ప్రజల జీవనానికి అవే ఆయువుపట్టు. అత్యంత పేదరికంతో సతమవుతున్న గ్రామీణ ప్రజలకు అండగా నిలిచే ఉద్దేశంతో ఆ దేశ అధ్యక్షుడు పౌల్ కగమె ‘గిరింకా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కుటుంబానికి ఓ ఆవును బహుమతిగా అందిస్తారు.
రువాండా పర్యటన ముగించుకుని, రేపు ఉగాండాకు పయనమవనున్నారు మోదీ. గత 21 ఏళ్లలో ఉగాండాలో అడుగుపెడుతున్న తొలి భారత ప్రధాని మోదీనే. రువాండా, ఉగాండాలతో రక్షణ, వ్యవసాయ సంబంధిత ఒప్పందాలను ప్రధాని కుదుర్చుకోనున్నారు.
అనంతరం ఉగాండా నుంచి ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడ జరగనున్న బ్రిక్స్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదివారమే రువాండ పర్యటనకు విచ్చేశారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ కూడా ఈ దేశంలో పర్యటిస్తుండటం మరో విశేషం.