కశ్మీర్ అంశంపై వేర్పాటువాద నేతలు, పాకిస్థాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. హురియత్ నేతలు సంప్రదింపులకు ముందుకు వస్తే చర్చించడానిని తాము సిద్ధమేనని తేల్చి చెప్పారు. పాక్తో చర్చలకు తాము వ్యతిరేకం కాదని కానీ పాక్ ముందు చొరువ చూపాలన్నారు.
పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కావడంతో కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన కొన్నిరోజుల తర్వాత రాజ్నాథ్సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. హరియత్ నేతలు చర్చలకు సిద్ధంగా ఉంటే ఎలాంటి సమస్యా లేదని, ఒకవేళ పాక్తో మాట్లాడానికి తమకు అభ్యంతరంలేదని ఆయన అన్నారు.
పాక్ చొరబాటు యత్నాలను ఆపడం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యను చేపట్టడం ద్వారా తన ఉద్దేశాన్ని చాటాలని ఆయన సూచించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు చేపట్టిన మధ్యవర్తుల నియామకం.. అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదని ఆయన అంగీకరించారు. కశ్మీర్లో శాంతిస్థాపనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్కడ పరిస్థితులు శాంతియుతంగా కొనసాగితే.. రంజాన్ తర్వాత కూడా కాల్పుల విరమణను కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
పాకిస్థాన్ చర్చలకు సిద్ధపడితే.. మేం ఎందుకు మాట్లాడం? పొరుగు దేశంతో సత్సంబంధాలు కావాలని మేం కోరుకుంటున్నాం. కానీ, పొరుగుదేశమే కొంత చొరవ చూపాల్సిన అవసరముంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదులు చొరబడేందుకు వీలు కల్పిస్తోంది. పాకిస్థాన్ తన విధానాలను మార్చుకోవడం లేదు. కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు పాక్ తన పద్ధతి మార్చుకోక తప్పదు’ అని రాజ్నాథ్ అన్నారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సైన్యంపై తొలిసారి రాళ్ల దాడులకు పాల్పడినవారు ముఖ్యంగా యువకులపై కేసులను ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. కశ్మీర్ మనది.. కశ్మీరీలు మనవాళ్లు.. పిల్లలను తప్పుదోవ పట్టించారు… అందుకే తొలిసారి సైన్యంపై రాళ్లు రువ్విన యువకులను తీవ్రవాదులుగా గుర్తించడానికి నిరాకరించాం’అని తెలియజేశారు. ఉగ్రవాదులకు స్వర్గంగా పాక్ మారందనే అంశంపై అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయంతో ఉందని వ్యాఖ్యానించారు.
మరోవైపు రాజ్నాథ్ ప్రకటనపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో హురియత్ నేతలు తమ పరిణితిని ప్రదర్శించాలని ఆమె కోరారు.