దేశ విదేశాల్లోనే ఎన్నో ఆస్తులున్న సహారా గ్రూప్ చైర్మన్ ఆస్తులపై సర్వోన్నత న్యాయస్ధానం అవాక్కయింది. ఇన్ని ఆస్తులున్న మీరు ఇన్వేస్టర్ల అప్పులు తీర్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించింది. 36 వేల కోట్ల బకాయిల తీర్చలేక రెండు సంవత్సరాలుగా తీహార్ జైలులో ఉన్న సుబ్రతో రాయ్ ఇటీవలే పేరోల్ పై విడుదలయ్యారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటే ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సిబిఐ సుబ్రతో రాయ్ కి దేశ విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్, న్యాయమూర్తులు ఎఆర్ దేవ్, ఎకె సిక్రిలతో కూడిన ధర్మాసనం సుబ్రతో రాయ్ ఆస్తులను చూసి నోరెళ్లబెట్టింది. ఇన్ని ఆస్తులున్న మీరు అప్పులు ఎందుకు తీర్చరంటూ ప్రశ్నించింది. సుబ్రతో రాయ్ కున్న ఆస్తుల వివరాలను సిబిఐ సీల్డు కవర్ లో సుప్రీం కోర్టుకు అందించింది.
అయితే ఈ సీల్డు కవర్ ను బహిర్గతం చేయరాదని, ఆయనకు ఆరు నెలలు బెయిల్ ఇస్తే అందరి అప్పులు తీర్చేస్తారంటూ కపిల్ సిబాల్ కోర్టును కోరారు. సెబి కూడా సుబ్రతో రాయ్ ఆస్తులను విక్రయించి ఆయన బకాయిలు తీరుస్తుందని, ఇప్పటికే సెబీ దగ్గర 12 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సిబాల్ ధర్మాసనానికి వెల్లడించారు.