కోల్ కత్తా పోలీస్ చీఫ్-సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టులో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. శారతా ఛిట్ ఫండ్స్ కుంభకోణంలో కోల్ కత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ఎదుట హాజరు అవ్వాలసిందేనని సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణలో కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం, బలవంతపు చర్యలు తీసుకోరాదని సీబీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
శారదా, రోజ్వ్యాలీ చిట్ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును మంగళవారం విచారించిన సుప్రీం.. కోల్కతా కమిషనర్ రాజీవ్ను విచారించే అధికారం సీబీఐకి ఉందని తెలిపింది.
విచారణ ఢిల్లీ, కోల్కతాలో కాకుండా తటస్థ ప్రదేశంలో విచారణ జరపాలని ఆదేశించింది.పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులిస్తూ ఫిబ్రవరి 18లోగా బదులివ్వాలని పేర్కొంది. ఈ కేసు పరిణామాల నివేదికను సీబీఐ సీల్డ్ కవర్లో ధర్మాసనానికి అందజేయగా.. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
వివరాల్లోకి వెల్తే…శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలపై రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్ గతంలో విచారణ జరిపింది. కేసులో నిందుతలను కాపాడేందుకు కీలక సాక్ష్యాలను నిందితులకు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.ఈ మేరకు సుప్రీంకు అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి ఆధారాలను తమకు అందజేయలేదని, ఆధారాలను తారుమారు చేశారంటూ రాజీవ్ కుమార్ పై అఫిడవిట్ లో ఆరోపించింది.గత ఆదివారం రాజీవ్ కుమార్ నివాసం వద్దకు వెళ్లిన సీబీఐ అధికారులను కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకుని, కొన్ని గంటల పాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నిరసగా సీఎం మమతా ఢిల్లీలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.