సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు మద్యమత్తులో వాగిన వాగుడే కారణమని పోలీసులు నిర్ధారించారు. జంటనగరాల్లో కలకలం రేపిన టెకీ సంజయ్ జుంగీ హత్య కేసు మిస్టరీని నగర పోలీసులు ఛేదించారు. వారు అందించిన వివరాల ప్రకారం..
పార్సీగుట్టలో నివసించే సంజయ్.. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతూ కూకట్పల్లిలో స్నేహితులతో మందుపార్టీ చేసుకున్నాడు. అక్కడినుంచి స్నేహితుడి బైక్పై పంజాగుట్ట చేరుకున్నాడు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో.. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు సరదాగా కారులో “జాయ్ రైడ్” చేస్తున్న సయ్యద్ ముబాషిరుద్దీన్ను లిఫ్ట్ కోరాడు. అర్ధరాత్రి కదా అని జాలితో వారు సంజయ్ను కారెక్కించుకున్నారు. అయితే.. మద్యం మత్తులో ఒళ్ళెరగని స్థితిలో ఉన్న సంజయ్.. ప్రేమ విషయమై తనకు లిఫ్ట్ ఇచ్చిన ముబాషిరుద్దీన్, అతడి స్నేహితులతోనూ గొడవ పడ్డాడు. స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు చేరగానే.. ముబాషిరుద్దీన్ అతడి మిత్రులు కోపంతో సంజయ్ని దించి.. డాగర్లు, కత్తులతో పొడిచి పరారయ్యాడు.
ఇంతకీ వారి వద్ద డాగర్లు ఎందుకున్నాయి..?
సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారును ట్రేస్ చేసి.. నిందితులు ముబాషిరుద్దీన్ను , అతని మిత్రులను అరెస్టు చేశారు. ఇంతకీ ముబాషిరుద్దీన్ డాగర్లు, కత్తులు ఎందుకు పెట్టుకు తిరుగుతున్నట్లు..? ముబాషిరుద్దీన్ సంతోశ్నగర్ పీఎస్ పరిధిలో ఓ యువతిని రేప్ చేసిన కేసులో నిందితుడు. ప్రాణభయంతో అతను డాగర్లు పెట్టుకు తిరుగుతున్నట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుల నుంచి కారు, మోటార్బైక్, రెండు డాగర్లు, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.