బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి బ్రిటన్కు పరారైన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయా ? ఈ దిశగా కేంద్రం చేపట్టిన చర్యలు ఫలితానిస్తున్నాయా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. భారత్ వస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్తో వచ్చే వారం జరిగే భేటీలో ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించనున్నారు.
మాల్యా, నీరవ్ అంశాలను ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. విచారణ కోసం వారిద్దరినీ భారత్కు అప్పగించాలని కోరారు. బ్యాంకులను మోసం చేసి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితర ఆర్థిక నేరగాళ్లను ఉపేక్షించకూడదని కేంద్రం భావిస్తోంది. ఎలాగైనా వారిని స్వదేశానికి రప్పించాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా భారత హోం శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తావించారు. పరస్పరం సహకరించుకోవాలని అప్పుడు జరిగిన సమావేశంలో బ్రిటన్ , భారత్ హోం శాఖ కార్యదర్శులు నిర్ణయించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 13, 500 కోట్ల మేర మోసం చేసి తన కుటుంబ సభ్యులతో నీరవ్ మోదీ లండన్కు పరారయ్యారు. ఎల్వోయూలతో బ్యాంకును నీరవ్ మోసం చేసిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగు చూసింది. అయితే అప్పటికే అతడు పరారయ్యాడు. నీరవ్ ప్రస్తుతం లండన్లో జైలు జీవితం గడుపుతున్నాడు. మరోవైపు అతడికి అత్యంత సన్నిహితుడైన సుభాష్ శంకర్ పరబ్ను ఇటీవలే సీబీఐ భారత్కు తీసుకువచ్చింది. ఈజిప్టు రాజధాని కైరోలో ఉన్న అతడిని భారత్కు తీసుకొచ్చినట్లు సమాచారం. నీరవ్కు చెందిన ఫైర్స్టార్ డైమండ్ కంపెనీలో ఆర్థిక విభాగానికి డిప్యూటీ జనరల్ మేనేజర్గా పరబ్ వ్యవహరించేవారు.
అటు ఒకప్పుడు లిక్కర్ కింగ్గా పేరుపొందిన విజయ్మాల్యా ఎస్బీఐ సారధ్యంలో బ్యాంకుల కన్సార్టియం వద్ద సుమారు రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో తనను అరెస్టు చేస్తారన్న భయంతో లండన్ పారిపోయారు. యూబీఎల్ షేర్ల విక్రయం ద్వారా ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.5,824.5 కోట్ల రుణాలను రాబట్టుకోగలిగింది. మరోవైపు తాను భారత్లో పర్యటించబోతున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.